శరవేగంగా అయోధ్యరామ మందిర నిర్మాణం.. లోక్సభ ఎన్నికలకు ముందే అయోధ్య రాముడి దర్శనం..!
అయోధ్య రామాలయం తలుపులు త్వరలోనే తెరుచుకోనున్నాయి. మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.;
అయోధ్య రామాలయం తలుపులు త్వరలోనే తెరుచుకోనున్నాయి. మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2023 చివరి నాటికి రామమందిర నిర్మాణం పూర్తి చేసి.. దర్శనాలు ప్రారంభించాలని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భావిస్తోంది. ఆలయంలోని గర్భగుడిలోకి రాముడు, సీత, లక్ష్మణుడి విగ్రహాలను తరలించి, భక్తులకు దర్శనం కల్పించడానికి యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపడుతున్నారు. తాత్కాలికంగా నిర్మించిన ఆలయంలో ప్రస్తుతం ఆ విగ్రహాలు ఉన్నాయి.
2024లో జరిగే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ మేరకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలకు కనీసం ఆరు నెలల ముందు గర్భగుడిలో భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇంతకుముందే రూపొందించిన ఆలయ నమూనా ప్రకారం 2025 లోపు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రామ మందిర ట్రస్టు వర్గాలు తెలిపాయి.
తాజాగా భేటీ అయిన శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్.. 2023 చివరినాటికల్లా భక్తులకు భగవాన్ దర్శనం కల్పించే విషయమై చర్చించారు. గర్భగుడి నిర్మాణం, మూలమూర్తి ప్రతిష్ఠాపన అంశాలనూ చర్చించారు. మొత్తం నిర్మాణం పర్యావరణ అనుకూలమైన విధంగాలో జరుగుతోంది. మొత్తానికి రామజన్మభూమిని కనులారా చూడాలనుకునే భక్తులకు 2023 చివరినాటికల్లా ఆ కల నెరవేరనుంది.