India corona Updates : భారత్లో 4 లక్షలు దాటిన కొవిడ్ మరణాలు..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. కరోనా ధాటికి మరణాల సంఖ్య పెరుగుతూనే పోతోంది.;
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. కరోనా ధాటికి మరణాల సంఖ్య పెరుగుతూనే పోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య 40 లక్షలకు చేరువ అవుతున్నాయి. భారత్లోనూ రికార్డుస్థాయిలో కరోనా మరణాలు సంభవించాయి. శుక్రవారం నాటికి 4 లక్షల మరణించారని కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
గత ఏడాది మార్చి 10న భారత్లో కొవిడ్తో తొలి మరణం సంభవించింది. ఈ మహమ్మారి ధాటికి ఇప్పటివరకు 4 లక్షల మంది బలైపోయారు. ప్రపంచంలో 4 లక్షలకు పైగా కొవిడ్ మరణాలు సంభవించిన దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ చేరింది. అమెరికాలో 6లక్షల 20 వేలు, బ్రెజిల్లో 5 లక్షలు 20వేల మంది మృత్యువాతపడ్డారు. అయితే భారత్లో ఇంతవరకు నమోదైన మరణాల్లో 59.41 శాతం ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాతే సంభవించాయి. 2 లక్షల 38 వేల మంది ఏప్రిల్ తర్వాతే మరణించారు. మొత్తం మరణాల్లో 30శాతం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.
ఈ ఒక్క రాష్ట్రంలోనే లక్ష మందికి పైగా మృతి చెందారు. శుక్రవారం నాటికి మొత్తం మరణాల రేటు 1.31 శాతానికి చేరింది. కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతిలో మరణాల రేటు 1.92శాతంగా ఉంది. కేసులతో పోలిస్తే మరణాల తీవ్రత సెకండ్ వేవ్లో అధికంగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి.