ప్రతీకాత్మక చిత్రం
కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ నుంచి వెనక్కి తగ్గేది లేదని రైతులు మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పంపిన పలు సవరణల ప్రతిపాదలను రైతులు తిరస్కరించారు. సింఘ్ సరిహద్దుల్లో సమావేశమైన రైతు సంఘాల నేతలు.. కేంద్రం పంపిన సవరణలపై చర్చించారు. అయితే.. అవేమి సమ్మతంగా లేవని వాటిని తిరస్కరించారు. ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈనెల 12న ఢిల్లీ-జైపూర్ రహదారిని దిగ్బంధించాలని పిలుపునిచ్చారు. 12న దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలను దిగ్బంధిస్తామన్నారు. బీజేపీ నేతల్ని ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు. ఈనెల 14న దేశవ్యాప్త ఆందోళనలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
రైతుల ఆందోళనల నేపథ్యంలో విపక్ష నేతలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. రాహుల్ గాంధీతోపాటు.. సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, డీఎంకే నేతలు రాష్ట్రపతిని కలిసి రైతుల ఆందోళనలపై చర్చించారు. అనేక అంశాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. భేటీ అనంతరం విపక్ష నేతలంతా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై రైతులు నమ్మకం కోల్పోయారని రాహుల్ గాంధీ విమర్శించారు. వ్యవసాయ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని సీపీఐ, సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.