South Central Railway: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్..
South Central Railway: మాల్డా టౌన్, రేవా మధ్య దాదాపు ఆరు వేసవి స్పెషల్ రైళ్లు ప్రయాణించనున్నాయి.;
South Central Railway: వేసవి కాలం.. విహార యాత్రలకు వెళ్లే సమయం.. గత రెండేళ్లుగా కరోనా కారణంగా వేసవి సెలవుల్లో ఎక్కడికీ వెళ్లకుండా గడిచిపోయింది.. కనీసం ఈ ఏడాది అయినా ఏదైనా చల్లని ప్రదేశానికి వెళ్లాలనుకునే వారికోసం భారతీయ రైల్వే స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. వివిధ ప్రాంతాలకు 968 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 30వ తేదీ నుంచి వారాంతాల్లో నడుస్తాయని రైల్వే శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
కొత్త రైళ్లలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, మన్మాడ్ మధ్య 126 రైళ్లు ఉన్నాయి. మాల్డా టౌన్, రేవా మధ్య దాదాపు ఆరు వేసవి స్పెషల్ రైళ్లు ప్రయాణించనున్నాయి. దాదర్, మడ్గావ్ మధ్య మరో ఆరు వేసవి రైళ్లు నడుస్తాయి. ఇక, తిరుపతి-హైదరాబాద్, తిరుపతి ఔరంగాబాద్ మధ్య 20 ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.
హైదరాబాద్-తిరుపతి (07509) రైలు శనివారం సాయంత్రం 4.35 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్ 30, మే 7,14,21,28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. తిరుపతి-హైదరాబాద్ రైలు (07510) మంగళవారం 11.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ సర్వీసు మే 3,10,17,24,31 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
తిరుపతి-ఔరంగాబాద్ (07511) స్పెషల్ ట్రైన్ ఆదివారం ఉదయం 07.05 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుందని, మరుసటి రోజు 7 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుందని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ రైలు మే 1,8,15,22,29 తేదీల్లో నడుస్తుంది.