corona vaccination : వ్యాక్సినేషన్లో అమెరికాను దాటేసిన భారత్
ఇప్పటివరకు యూఎస్ తమ ప్రజలకు 32.3 కోట్ల టీకా డోసులు ఇవ్వగా.. భారత్ 32.36 కోట్ల వ్యాక్సిన్ డోసులతో ముందంజలో నిలిచింది.;
వ్యాక్సినేషన్ విషయంలో అగ్రరాజ్యం అమెరికాను అధిగమించి భారత్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు యూఎస్ తమ ప్రజలకు 32.3 కోట్ల టీకా డోసులు ఇవ్వగా.. భారత్ 32.36 కోట్ల వ్యాక్సిన్ డోసులతో ముందంజలో నిలిచింది. ఫలితంగా ప్రపంచంలోనే భారత్ అత్యధిక టీకాలు వేసిన దేశంగా అవతరించింది. గ్లోబల్ వ్యాక్సిన్ ట్రాకర్ అందించిన నివేదిక ప్రకారం బ్రిటన్, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, భారత్ల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే మన దేశ జనాభాలో 18 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 5.6 శాతం మంది టీకా రెండు డోసులు తీసుకున్నారు. అదే యూఎస్ జనాభాలో సుమారు 40 శాతం మంది వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారు. భారత్లో గత వారం రోజుల్లో 3.91 కోట్ల డోసులను ప్రజలకు ఇచ్చారు. ఇది కెనడా, మలేషియా, సౌదీ అరేబియా లాంటి దేశాల మొత్తం జనాభాతో సమానం.
అమెరికా జనాభాలో 46.5 శాతం మందికి అంటే 15 కోట్ల 30 లక్షల మందికి రెండు డోసులు పూర్తవగా.. భారత్లో 4 శాతం మందికి అంటే 5 కోట్ల 60 లక్షల మందికి రెండు డోసులు అందాయి. మరోవైపు తమ దేశంలో వంద కోట్ల మందికి టీకా పంపిణీ చేసినట్లు ఇటీవల చైనా ప్రకటించుకుంది. ఈలెక్కన భారత్.. ప్రపంచంలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. అటు కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన బ్రెజిల్లో ఇంకా 10 కోట్ల మందికే వ్యాక్సిన్ వేశారు.