కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్కు తమిళనాడులో మహిళలు షాక్ ఇచ్చారు. 2024 ఎన్నికల ప్రచారం కోసం.. వాల్ టు వాల్ ప్రచారాన్ని నిర్మల ప్రారంభించారు. ఇందులో భాగంగా తమిళనాడులోని పజైయసీవరం గ్రామంలో రాష్ట్ర మంత్రి ఎల్ మురుగన్తో కలిసి నిర్మలా సీతారామన్ పర్యటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా స్థానికులతో మమేకమై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలు వారికి అందాయా అని ప్రశ్నించారు. ఆ సమయంలో గృహిణుల బృందం కేంద్రమంత్రిని చుట్టుముట్టి వంట గ్యాస్ ధర తగ్గించాలని డిమాండ్ చేశారు. గృహిణుల ప్రశ్నలకు సమాధానమిస్తూ... వంటగ్యాస్ ధరను అంతర్జాతీయ మార్కెట్ నిర్ణయిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. మన దేశంలో వంట గ్యాస్ లేదు. కేవలం దిగుమతి చేసుకుంటున్నాం. మనం దిగుమతి చేసుకుంటే, అక్కడ ధర పెరిగితే, ఇక్కడ కూడా పెరుగుతోంది. అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతోంది. కానీ గత రెండేళ్లలో పెద్దగా ధర తగ్గలేదు’’ అని కేంద్ర నిర్మలా సీతారామన్ గృహిణులకు వివరణ ఇచ్చారు. మొత్తం మీద మహిళలు వంటగ్యాస్ ధరలపై కేంద్రమంత్రిని నిలదీశారు.