దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోన్న భారీ అవినీతి దేశానికి పెను సవాల్ విసురుతోందని, చెదపురుగులా పట్టి తొలిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వంగా మారిన కుంభకోణాలు కొన్ని రాష్ట్రాల రాజకీయ సంస్కృతిలో అంతర్భాగమై పోయాయని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారికి సరైన శిక్ష పడకపోతే, ఆ తర్వాత వచ్చే తరం మరింతగా రెచ్చిపోతుందని హెచ్చరించారు. నల్లధనం కూడబెట్టే వారిపై ఎలాంటి చర్యలు లేకపోయినా, చిన్న శిక్షతో సరిపెట్టినా చుట్టుపక్కలున్న వారికి మరింత ధైర్యం వస్తుందన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్' సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.