బీజేపీ సీనియర్ నేత అద్వానీ పుట్టిన రోజు: ప్రముఖుల శుభాకాంక్షలు
బీజేపీ సీనియర్ నేత లాల్కృష్ణ అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.;
Advani Birthday: బీజేపీ సీనియర్ నేత లాల్కృష్ణ అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా ఎల్.కె.అద్వానీ ఇంటికి వెళ్లిన ప్రధాని.. బర్త్డే విషెష్ చెప్పారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు.
అద్వానీ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ దాదాపు 30 నిమిషాల పాటు అద్వానీ నివాసంలో గడిపారు. అద్వానీకి పుష్పగుచ్చం అందజేసి కొంతసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. ప్రత్యేకించి- గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తీరుతెన్నులను అద్వానీ అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు.
దేశ రాజకీయాల్లోనే సీనియర్ నేతగా పేరున్న అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్డీయే కన్వీనర్గా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన సమయంలో.. ఎల్.కే.అద్వానీతో కలిసి పనిచేశారు. ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ చంద్రబాబు ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక.. కేంద్రం తరపున మద్దతుగా నిలిచారు. అద్వానీపై చంద్రబాబుకు ఉన్న గౌరవంతో.. అప్పట్లో కృష్ణా పుష్కరాలకు స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగాలని గట్టిగా మాట్లాడిన వారిలో అద్వానీ కూడా ఒకరు. యూపీఏ ప్రభుత్వం విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ప్రత్యేక హోదా పైన నిర్ణయం తీసుకోవాలని అప్పట్లో అద్వానీ మోదీ ప్రభుత్వానికి సూచించారు.