సూయజ్ కెనాల్ ఆపరేషన్లో పురోగతి.. !
ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.. సూయజ్ కెనాల్లో ఆపరేషన్ విజయవంతం దిశగా సాగుతోంది. ఎవర్ గివన్ కంటైనర్ షిప్ ఈరోజు పూర్తిగా కదిలే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.;
ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.. సూయజ్ కెనాల్లో ఆపరేషన్ విజయవంతం దిశగా సాగుతోంది. ఎవర్ గివన్ కంటైనర్ షిప్ ఈరోజు పూర్తిగా కదిలే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.. నిన్న షిప్ రెండు అంగుళాల మేర కదలగా.. ఈరోజు ఆపరేషన్లో మరో ముందడుగు పడింది.. భారీ షిప్ను మరింత కదిలించేందుకు రెస్క్యూ సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన తాజా వివరాలను సూయజ్ కెనాల్ అథారిటీ వెల్లడించింది. త్వరలోనే ఈ నౌక పూర్తిగా తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పలు టగ్ బోట్లు దాన్ని బయటికి లాగేందుకు యత్నిస్తుండగా.. మరో రెండు పడవలు షిప్ను కదిల్చే పనుల్లో నిమగ్నమయ్యాయి.. ఓవైపు 20 వేల టన్నుల ఇసుకను తవ్వడంతో షిప్ కింది నుంచి నీళ్లు ప్రవహిస్తున్నట్లు సుయెజ్ కాలువ అథారిటీ చైర్మన్ ఒసామా రాబీ చెప్పారు. ఏ సమయంలో అయినా ఆ షిప్ నీళ్లపై తేలే అవకాశం ఉందని అంటున్నారు. అటు ఈ భారీ షిప్ను సవ్యదిశలోకి చేర్చే పనులు వేగంగా కొనసాగుతుండటంతో కెనాల్లో నిలిచిపోయిన నౌకల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భారీ గాలుల కారణంగా 400 మీటర్ల పొడువున్న ఎవర్ గివన్ షిప్ ఈనెల 23న సుయెజ్ కాలువలో అడ్డం తిరిగింది. నౌక భారీగా ఉండడంతో పాటు బరువైన సరుకు ఉండడంతో కదల్చడానికి వీలులేకుండా పోయింది. దీని కారణంగా కొన్ని వందలాది నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో రోజుకు 75వేల కోట్ల రూపాయల విలువైన సరుకు నిలిచిపోతోందని అంచనా వేస్తున్నారు.