ఇంజినీర్‌ నుంచి సీఎం వరకు..బసవరాజు బొమ్మై నేప‌థ్యం ఇలా ..

Basavaraj Bommai: మాజీ సీఎం SR బొమ్మై కుమారుడుగా అందరికి సుపరిచితుడు. యడ్యూరప్పకు అత్యంత సన్నిహితుడు.

Update: 2021-07-28 01:12 GMT

Basavaraj Bommai: కర్ణాటకలో కొత్త సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మెని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. పార్టీ శాసనసభాపక్ష సమావేశంలోనూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక ఓటర్లలో అధిక ప్రాబల్యం కల్గిన లింగాయత్ సామాజిక వర్గానికే సీఎం పీఠం అప్పగిస్తూ కమలనాథులు నిర్ణయం తీసుకున్నారు. యడియూరప్ప క్యాబినెట్‌లో హోంమంత్రిగా ఉన్న బొమ్మె..ఏకంగా సీఎం పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు.

కర్ణాటక సీఎం పదవి మళ్లీ లింగాయత్‌ సామాజిక వర్గానికే దక్కింది. కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మైను ఎంపిక చేసింది బీజేపీ హైకమాండ్‌. ప్రస్తుతం కర్ణాటక హోంమంత్రిగా ఉన్న బసవరాజు... మాజీ సీఎం SR బొమ్మై కుమారుడుగా అందరికి సుపరిచితుడు. యడ్యూరప్పకు అత్యంత సన్నిహితుడు. యూత్‌ లీడర్‌ నుంచి సీఎంగా ఎదిగారు బసవరాజ్ బొమ్మై. ఈయ 1960 జనవరి 28న హుబ్లీ జన్మించారు. భార్య చెన్నమ్మతోపాటు కమార్తె, కుమారుడు ఉన్నారు.

ఇంజినీరింగ్ పూర్తిచేసి బసవరాజ్ బొమ్మై... టాటా గ్రూప్‌లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. జనతాదళ్‌తోనే రాజకీయజీవితాన్ని ప్రారంభించిన బసవరాజు 1995లో జనతాదళ్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. అనంతరం 1996-97లో కర్ణాటక సీఎంగా ఉన్న జీహెచ్ పటేల్‌కు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. 1998,2008లో ధారవాడ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచారు. 2007లో ధారవాడ నుంచి నరగుండ వరకు 232 కిలోమీటర్ల మేర రైతుల కోసం పాదయాత్ర చేశారు. 2008లో బీజేపీలో చేరిన బసవరాజు..

అదే ఏడాది షిగ్గాన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 జూన్‌ 7వ తేదీ నుంచి2013 మే13 వరకు జలవనరుల మంత్రిత్వశాఖను నిర్వహించారు. 2019 ఆగస్టు 16 నుంచి 2021 జులై 26 వరకు రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. హావేరి జిల్లాలోని షిగ్గాన్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా బసవరాజ్ బొమ్మై విజయభేరి మోగించారు.

కర్ణాటక ఓటర్లలో అధిక ప్రాబల్యం కల్గిన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మై..రైతుగా, వ్యాపారవేత్తగా ఎదిగారు. నీటిపారదలపై పూర్తిస్థాయి పట్టుసాధించారు బసవరాజ్ బొమ్మై. దేశంలో తొలిసారిగా షిగ్గావ్‌ ప్రాంతంలో వందశాతం నీటిపారుదల ప్రాజెక్టును విజయవంతం చేశారు. కర్ణాటకలో ఎన్నడూ లేనివిధంగా కరోనా కేసుల ఉద్ధృతి సమయంలో...తన నివాసాన్నే కొవిడ్ కేర్ సెంటర్‌గా చేసిన ఘనత బసవరాజ్ బొమ్మైది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఓ మంత్రి తన నివాసాన్ని కొవిడ్ కేంద్రంగా మార్చిటం స్థానికంగా సంచలనమైంది.

క్లిష్ట పరిస్థితుల్లో తనపై పెద్ద బాధ్యత పెట్టారని, పేదల సంక్షేమం కోసం పనిచేస్తామంటున్నారు బసవరాజు బొమ్మై. అధికారపగ్గాలు అప్పగించిన తననను ఆశీర్వదించినందుకు.. ప్రధాని మదోీ, హోంమంత్రి అమిత్‌షా, మాజీ సీఎం యడియూరప్పకు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News