Tamil Nadu Rains: తమిళనాడులో ఆగని వర్షాలు.. ప్రభుత్వ సహాయక చర్యలు..
Tamil Nadu Rains: రాజధాని చెన్నై సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.
Tamil Nadu Rains: రాజధాని చెన్నై సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. మూడో రోజులుగా కురుస్తున్న వర్షంతో చెన్నై తడిసిముద్దయింది. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నుంగంబాక్కం, ఎగ్మూరు, అంబత్తూరు, అయనవరం, ఎంజీ ఆర్నగర్, కోట్టూరుపురం, పెరంబూరు, మాధవరం, మనలి, ముగప్పేర్, కొరట్టూరు, అన్నానగర్ తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలతో ఎక్కడ చూసినా నీరే కనబడుతోంది.
ప్రధాన రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో వర్షపు నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నానగర్, ముగప్పేర్, అంబత్తూరు, మదురవాయల్, కోయంబేడు ప్రాంతాల్లోని పలు రహదారులు, వీధుల్లో వరద దృశ్యాలే కొనసాగుతున్నాయి. ప్రముఖ వాణిజ్య కేంద్రమైన టి.నగర్లోని దుకాణాల్లోకి వర్షపు నీరు చేరడంతో నష్టపోయారు.
చెన్నైతో సహా తిరువళ్లూర్, చెంగల్పట్టు, మధురైలోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. తమిళనాడులో మరో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధ, గురువారాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ- వాయవ్య దిశగా కదిలి 11న తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకుంటుంది. ఈ ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురవొచ్చని తెలిపింది. దీంతో చెన్నై సహా చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.