Toll Charges :పెరిగిన టోల్ గేట్ ఛార్జీలు
ఇరువైపులా కలిపి 5 రూపాయల నుంచి 40 రూపాయల వరకు, స్థానికుల నెలవారీ పాస్లపై 275 రూపాయల నుంచి 330 రూపాయాలు వరకు టోల్ రుసుములు పెరిగాయి;
జాతీయ రహదారులపై పెరిగిన టోల్ గేట్ ఛార్జీలు, అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. టోల్ప్లాజా మీదుగా ప్రయాణించే వాహనాలకు వాటి స్థాయిని బట్టి ఒకవైపు, ఇరువైపులా కలిపి 5 రూపాయల నుంచి 40 రూపాయల వరకు, స్థానికుల నెలవారీ పాస్లపై 275 రూపాయల నుంచి 330 రూపాయాలు వరకు టోల్ రుసుములు పెరిగాయి. WPA, GDP గణాంకాల ఆధారంగా ఏటా ఏప్రిల్ 1న టోల్ ఛార్జీలను కేంద్రం పెంచుతోంది. సొంత కారులో 24 గంటల వ్యవధిలో హైదరాబాద్ నుంచి విజయవాడకు జాతీయ రహదారి 65 మీదుగా వెళ్లి రావడానికి వాహనదారులు ప్రస్తుతం 465 టోల్ చెల్లిస్తున్నారు. ఇవాళ్టి నుంచి 490 చెల్లించాల్సి ఉంటుంది. అంటే 25 రూపాయలు పెరిగింది. ఈ మార్గంలో పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు వద్ద టోల్ప్లాజాలు ఉన్నాయి. ఒకవైపు ప్రయాణానికి ప్రస్తుతం 310 చెల్లిస్తుండగా ఇకపై 325 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరలు 2024 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి.
తెలంగాణలో హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, డిండి, యాదాద్రి, వరంగల్, భూపాలపట్నం, నాగ్పుర్, పుణె తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు జాతీయ రహదారులు ఉన్నాయి. తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు పది జాతీయ రహదారులు ఉన్నాయి. ఆయా రహదారులపై తెలంగాణ పరిధిలో 32 టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-వరంగల్ మార్గాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. తాజా పెంపుతో.... ప్రయాణీకలపై అదనపు భారం పడుతోంది.