ప్రశాంత్ కిషోర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి.. ప్రస్తుతానికి సస్పెన్స్ అదే... !
ప్రశాంత్ కిషోర్... జాతీయ రాజకీయాల్లో ఈ పేరు ఇప్పుడో సంచలనం! ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు తిరుగులేదు.;
ప్రశాంత్ కిషోర్... జాతీయ రాజకీయాల్లో ఈ పేరు ఇప్పుడో సంచలనం! ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు తిరుగులేదు. ఇప్పటికే చాలా పార్టీలు, నేతలకు తిరుగులేని విజయాలను అందించారు. ఇటీవల జరిగిన తమిళనాడు-పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ పీకే టీమ్దే హవా. డీఎంకే-టీఎంసీ గెలుపులో అత్యంత కీలకంగా వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్. ఎదురులేని వ్యూహాలు, వరుస విజయాలతో జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. ఇప్పుడు పీకే టీమ్ 2024 ఎన్నికలే టార్గెట్గా పనిచేస్తోంది.
ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన ఓ మీటింగ్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది..PK పార్టీలో చేరడంపై చర్చ జరిగినట్టు లీకులు వస్తున్నాయి. భేటీలో సోనియా, రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు. రాబోయే పంజాబ్, యూపీ ఎన్నికల గురించి చర్చించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. అలాగే తమిళనాడు, బెంగాల్ ఫలితాల్నీ PK గాంధీల వద్ద విశ్లేషించారు. ఐతే.. వీటికంటే ముఖ్యమైన అంశంపై చర్చ జరిగిట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్లో పీకే క్రియాశీల పాత్ర పోషిస్తారనే మాట కూడా వినిపిస్తోంది. అలాగే పార్టీలో ప్రశాంత్ కిషోర్కి ఎలాంటి స్థానం కల్పిస్తారో కూడా చర్చకు వచ్చిందంటున్నారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత తాను రాజకీయ వ్యూహకర్తగా పని చేయటం లేదని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. అయితే, గతంలో జేడీయూ లో పని చేసి ఉద్వాసనకు గురైన పీకే ఇప్పుడు రాజకీయంగా ఒక లక్ష్యం..కసితో పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఏ విధంగా అయినా బీజేపీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి రాకుండా పని చేసేందుకు అన్ని అవకాశాలను..తన శక్తిని-సమర్దతను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది . ఇదే ఇప్పుడు గాంధీ కుటుంబాన్ని ఆకర్షించిందని అంటున్నారు. ఈ చర్చల్లో ప్రశాంత్ కిషోర్ చెప్పిన అంశాలు-వ్యూహాలతో పాటుగా 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
బీజేపీయేతర పార్టీల్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. శరద్ పవార్ నేతృత్వంలో ఇప్పటికే మూడుసార్లు సమావేశాలు కూడా జరిగాయి.ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ని PK కలవడం ఆసక్తికరంగా మారింది. ఐతే.. ఆయన పార్టీలో చేరతారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేసేందుకు కెప్టెన్ అమరీందర్కు అడ్వైజర్గా ఉన్న PK.. తన టీమ్కు ఇప్పటికే యాక్షన్లోకి దింపారు. అదయ్యాక 2024 టార్గెట్గా వ్యూహం ఉంటుందని, కాంగ్రెస్ ముఖ్యనేతలతో త్వరలో మరిన్ని సమావేశాలు జరగుతాయని తెలుస్తోంది. స్పాట్..
2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించటమే ప్రశాంత్ కిషోర్ లక్ష్యంగా మారిందంటున్నారు విశ్లేషకులు. దీంతో..ఆయన ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారని అంటున్నారు. రానున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్కు కీలకం కానున్నాయి. గతంలో పంజాబ్ లో కాంగ్రెస్ను గెలిపించి..కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎన్నికల ప్రచారంలో వినూత్నం గా వ్యవహరించి ఆయన గెలుపుకు సహకరించారు. ఇప్పుడు మళ్లీ పంజాబ్..ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని దెబ్బ తీస్తే, 2024 ఎన్నికల లక్ష్యంలో తొలి విజయం సాధించనట్లేనని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా.. ఇప్పటి నుండే ఆయనకు బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ భావిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.
అయితే పీకే కన్ను ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలపైనే ఉందన్న మరో మాట కూడా వినిపిస్తోంది...అందుకే వివిధ పార్టీల ముఖ్యనేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. తాజాగా రాహుల్, ప్రియాంకలతో సమావేశం కూడా ఇందులో భాగమేనని అంటున్నారు.. గతంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తోనూ భేటీ అయ్యారు. మొత్తానికి పీకే జరుపుతున్న ఈ వరస సమావేశాల పరమార్థం ఏమిటనే అంశంపై వివిధ రకాల ప్రచారాలున్నాయి.