ఇప్పటికే 20 కోట్ల మందికి కరోనా..మిస్టరీ అంశాల్లో 'లాంగ్ కొవిడ్' ఒకటి- డబ్యూహెచ్వో
WHO: ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి.. ఇప్పటికే 20కోట్ల మందిలో వెలుగు చూసింది.;
ఏడాదిన్నర కాలంగా ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి.. ఇప్పటికే 20కోట్ల మందిలో వెలుగు చూసింది. ఇక గుర్తించని వారి సంఖ్య మరింత ఎక్కువగానే ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది దీర్ఘ కొవిడ్ సమస్యలతో బాధపడడం ఆందోళన కలిగించే విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్ మహమ్మారికి సంబంధించిన మిస్టరీ అంశాల్లో 'లాంగ్ కొవిడ్' ఒకటిగా మిగిలిపోయిందని అభిప్రాయపడింది. వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత కూడా ఏమైనా దుష్ప్రభావాలు ఎదురైతే వైద్యుల సహాయం తీసుకోవాలని సూచించింది.
'పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ లేదా లాంగ్ కొవిడ్' అనేది వాస్తవమని. దీనిని తాము కూడా నిర్ధారించుకున్నామని WHO తెలిపింది. కానీ, ఇవి ఎంతకాలం ఉంటాయనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని, వీటిపై అధ్యయనం చేసి పూర్తిగా నిర్వచించే పనిలో నిమగ్నమయ్యామని కొవిడ్-19పై WHO టెక్నికల్ విభాగాధిపతి మరియా వాన్ కేర్ఖోవ్ పేర్కొన్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత చాలామంది సుదీర్ఘ కాలం పాటు వాటి దుష్ర్పభావాలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
దీర్ఘ కాలం కొవిడ్ ప్రభావాలతో బాధపడుతున్న వారికి మెరుగైన పునరావాస కార్యక్రమాలు కల్పించడంతో పాటు పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి చేస్తోందని మరియా వాన్ స్పష్టం చేశారు. అయినప్పటికీ వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కనిపించే లక్షణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు.
కొవిడ్-19 ఇన్ఫెక్షన్ తగ్గినప్పటికీ అనేక మంది బాధితుల్లో దీర్ఘకాలం పాటు కొన్ని రుగ్మతలు కనిపిస్తున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. వీటి సంఖ్య 200లకుపైగానే ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది వాస్తవమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లినికల్ కేర్ విభాగాధిపతి జానెత్ దియాజ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఛాతి నొప్పి, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని అన్నారు. కొందరిలో ఇవి కోలుకున్న తర్వాత మూడు నెలలు కనిపించగా.. మరికొందరిలో 6నెలల వరకూ ఉన్నాయని వెల్లడించారు.
అంతేకాకుండా మరికొందరి బాధితుల్లో ఇవి తొమ్మిది నెలలకుపైగా ఉండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. సుదీర్ఘ కాలం లక్షణాలు కనిపించడానికి నరాల సమస్యలు, ఇన్ఫెక్షన్పై రోగనిరోధకత ప్రతిస్పందనతో పాటు పలు అవయవాల్లో వైరస్ అలాగే ఉండిపోవడం వంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయన్నారు. వీటిపై మరింత స్పష్టత వచ్చేందుకు 2019లో చైనాలో తొలిసారి వైరస్ బారినపడి కోలుకున్న బాధితులపైనా అధ్యయనం జరిగితే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.