Punjab Poll : పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం..!

Punjab Poll : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 14న జరగాల్సిన పంజాబ్‌ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది.

Update: 2022-01-17 09:01 GMT

Punjab Poll : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 14న జరగాల్సిన పంజాబ్‌ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. ఒక్క ఫేజ్‌లోనే ఫిబ్రవరి 14న పంజాబ్‌ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఎన్నికలను వాయిదా వేయాలని పంజాబ్‌లోని అన్ని పార్టీలు కేంద్రం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఎన్నికల సంఘం.. వాయిదా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రంలోగా దీనిపై సీఈసీ ప్రకటన చేయనుంది. తదుపరి ఎన్నికల తేదీ ఎప్పుడన్నది.. ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

పంజాబ్‌లో ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు గురు రవిదాస్‌ జయంతి వేడుకలు జరుగుతాయి. దళిత వర్గాలు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొంటాయి. పంజాబ్‌ మొత్తం జనాభాలో 32శాతం దళితులే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఎన్నికల సమయంలో అందుబాటులో ఉండరు. గురు రవిదాస్‌ జయంతి వేడుకల కోసం.. లక్షల సంఖ్యలో దళితులు.. పంజాబ్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్‌కు వెళతారు. ఫిబ్రవరి 16న గురు రవిదాస్‌ జయంతిని అట్టహాసంగా నిర్వహిస్తారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహించడం సరికాదని.. పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్ సింగ్‌ చన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరేందర్‌సింగ్‌ కూడా వాయిదా వేయాలని కోరారు. బీజేపీ కూడా మెజార్టీ వర్గాల ప్రజలు అందుబాటులో ఉండరు కాబట్టి.. వాయిదా వేయడం మంచిదని కోరింది. వీటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. ఎన్నికల తేదీ వారం రోజులు ముందుకు జరగొచ్చని తెలుస్తోంది. 

Tags:    

Similar News