UP: ఆస్పత్రిలో 10 మంది చిన్నారుల సజీవ దహనం
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో తీవ్ర విషాదం... ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చెలరేగిన మంటలు;
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో చిన్నారుల సజీవ దహనం ఘటన.. తల్లులకు తీవ్ర కడుపు కోతను మిగిల్చింది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు చెలరేగడంతో.. పది మంది శిశువులు సజీవదహనమయ్యారు. మంటల వ్యాప్తితో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట సైతం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని చిన్నారుల విభాగం ఐసీయూలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 10 మంది చిన్నారులు సజీవదహనం అయ్యారని జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
మొత్తం 47 మంది చిన్నారులు
మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్లో అప్పుడే పుట్టిన శిశువులకు చికిత్సను అందిస్తారు. పుట్టిన వెంటనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులు ఇందులో కొన్ని రోజులు ఉంచి ఆ తరువాత తల్లిదండ్రుల దగ్గరకు చేరుస్తారు. మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మొత్తం 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకొని బయటకు పరుగెత్తారు. అయినా కూడా పది మంది శిశువులు మాత్రం మంటలకు బలయ్యారు. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న గర్భిణులను వారి బంధువులు క్షేమంగా బయటకు తరలించారు. మంటల వ్యాప్తితో ఒక్కసారిగా ఆ ప్రాంగణంలో దట్టమైన పొగ వ్యాపించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రధాని, యూపీ సీఎం సంతాపం
షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చేలరేగి ఉంటాయని జిల్లా కలెక్టర్ అవినాశ్ కుమార్ వెల్లడించారు. ప్ర్తుతం చిల్లా యంత్రాంగం అంతా ఆసుపత్రి దగ్గరే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన ఎలా జరిగిందో వెంటనే దర్యాప్తు చేపట్టాలన్నారు.