ఉత్తరప్రదేశ్ అయోధ్య రామ మందిరం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 2024 జనవరి కల్లా పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. అద్భుతమైన ఆలయానికి తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి ప్రజలు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆభరణాలు, నగలు, చీరలు తమ శక్తి కొలది సమర్పిస్తున్న వారు ఉన్నారు. గుజరాత్ వడోదరలో తర్సాలేకి చెందిన భక్తులు అయోధ్య రాములపై తమ భక్తిని చాటుకున్నారు రామమందిరానికి అందించడం కోసం 108 పొడుగుల అగర్బత్తిని తయారు చేస్తున్నారు.
గుణాన్ని బట్టి ఒక వ్యక్తిని భగవంతునిగా ఆరాధించే అద్భుతమైన ధర్మం హిందూ ధర్మం. అటువంటి ధర్మాన్ని పాటించే మన దేశం ఆధ్యాత్మికతకు మారుపేరు. రాముడు పాలించిన పుణ్య భూమి. అందుకే ఇక్కడ శ్రీరాముని పూజించని భారతీయుడు కనపడదు. జీవితంలో ఆయన ఎదురుకున్న పరిస్థితులనీ, జీవితం ఆయన పట్ల వ్యవహరించిన తీరుని పరికించి చూస్తే ఆయన వివత్తుల వలయంలో చిక్కుకున్నట్లు అనిస్పిస్తుంది. కానీ రాముని ఔన్నత్యం, జీవితంలో ఆయన ఎదురుకున్నపరిస్థితుల్లో లేదు, ఆయన తన జీవితాన్ని ఎంతటి సామరస్యంతో, హుందాతనంతో నిర్వహించుకున్నారన్నదానిలో ఉంది. తన నడవడికతో ఆదర్శవంతమైన జీవన మార్గాన్ని చూపిన శ్రీరాముని కోసం తమ వంతు సేవగా 3403 కిలోల బరువుతో 108 అడుగుల బాహుబలి అగర్బత్తి తయారు చేశారు తర్సాలీ వాసులు. దీని చుట్టుకొలత 3.5 అడుగులు. 191 కిలోల ఆవు నెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల బార్లీ, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొబ్బరిపొడి, 425 కిలోల పూర్ణాహుతి సామాను, ఒక 1475 కిలోల ఆవు పేడను ఈ అగర్బత్తి తయారీకి వినియోగించారు. ఇందుకు అయిన ఖర్చు అయిదు లక్షలు కాగా ఇకపై తరలించడానికి అయ్యే ఖర్చు 4.5 లక్షలు. అసలు ఈ అగర్బత్తి తయారీకి సంకల్పించినది విహాభాయ్ అనే రైతు. ఆ రామ భక్తుని సంకల్పానికి గ్రామస్తులు కూడా తమ వంతు సహాయం అందించారు. రామభక్తులంతా కలిసి తలా ఓ చెయ్యి వేసి తయారు చేసిన ఈ అగర్బత్తి 2023 డిసెంబర్ కల్లా భారీ ఊరేగింపుగా రామ జన్మభూమికి చేర్చనున్నారు.