Jammu Kashmir Vaishno Devi: జమ్మూకశ్మీర్‌ మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి..

Jammu Kashmir Vaishno Devi: కొత్త సంవత్సరం వేళ విషాదం నెలకొంది.

Update: 2022-01-01 13:30 GMT

Jammu Kashmir Vaishno Devi: కొత్త సంవత్సరం వేళ విషాదం నెలకొంది. జమ్మూ కశ్మీర్‌లోని ప్రఖ్యాత మాతా వైష్ణోదేవి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 12మంది భక్తులు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆలయ అధికారులు, సిబ్బందితో కలిసి పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

కొత్త సంవత్సరం సందర్భంగా వైష్ణోదేవిని దర్శించుకుని తరించడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తడంతో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. త్రికూట కొండలపై ఉన్న ఆలయ గర్భగుడి వెలుపల తొక్కిసలాట జరిగింది. తెల్లవారుజామున 2.45గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చాలా మంది భక్తులు దర్శనం చేసుకోకుండా వెనుదిరుగుతున్నారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌‌కు చెందిన భక్తులున్నట్టు గుర్తించారు. తొక్కిసలాటకు సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ.. సహాయకచర్యల వేగం పెంచాలని ఆదేశించారు. తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్న ప్రధాని... మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News