Road Accident: మంటల్లో కాలి బూడిదైన బస్సులు.. 13 మంది మృతి
సుమారు 80 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్ లోని మథుర వద్ద ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే పై ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ తెల్లవారుజామున పొగమంచు కారణంగా బస్సులు, కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఆ తర్వాత భారీగా మంటలు చెలరేగి.. వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కి పెరిగినట్లు అధికారులు తాజాగా తెలిపారు. సుమారు 80 మంది గాయపడినట్లు వెల్లడించారు.
మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై పది బస్సులు, పలు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో బస్సులకు మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడటంతో ఏడు బస్సులు, కార్లు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 11 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఎక్స్ప్రెస్వేపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. కాగా, గత రెండు రోజులుగా ఉత్తదారి రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది. దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. దీంతో విజిబిలిటీ పడిపోయి.. గత రెండు రోజుల్లో వరుసగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి.