Chhattisgarh: 13 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ఎక్కడంటే

ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం..;

Update: 2025-06-28 07:15 GMT

దేశ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో మావోయిస్టులకు తీవ్ర ప్రతి ఘటనలు ఎదురవుతున్నాయి. కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌లో మావోయిస్ట్ కీలక నేతలతో సహా పలువురు మృత్యువాత పడ్డారు. దీంతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక అభయారణ్యంలో మావోల మనుగడ కష్టంగా మారింది. ఇప్పటికే తమ ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ పిలుపు సత్ ఫలితాన్ని ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 8 మంది మహిళలు సహా 13 మంది లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.23 లక్షల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. కేంద్రం కల్పించిన నిబంధనల ప్రకారం లొంగిపోయిన మావోలకు పునరావాసం కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

ఇక లొంగిపోయిన మహిళల్లో ఒకరైన దేవ్ ముచాకి అలియాస్ ప్రమీల (21)పై రూ.8లక్షల రివార్డు ఉంది. ఇక ధమ్తారి-గరియాబంద్-నువాపాడ డివిజన్ పరిధిలోని ఏరియా కమిటీ సభ్యుడైన కోసా ఓయం అలియాస్ రాజేంద్ర అలియాస్ మహేష్ అలియాస్ మహేష్ సాగర్ అలియాస్ రమేష్ (29) పై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో మావోయిస్టు కోసి పోడియం (27) తలపై రూ.2 లక్షల రివార్డు ఉంది. సమ్మి సెమ్లా (23), ఛోటూ పార్సిక్ అలియాస్ దీపక్ (25), మోతీ తాటి (24), సునీత హేమ్లా (24), మంజుల కుంజమ్ (27), సైబో పొడియం (18), హంగీ ఉండుమ్ అలియాస్ రాధ (21) తలపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉందని.. మిగతా ముగ్గురికి ఎలాంటి పారితోషికం లేదని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లకు ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున అందించామని, ప్రభుత్వ విధానం ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని అధికారి తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలో ఇప్పటివరకు 241 మంది నక్సలైట్లు హింసను విరమించుకున్నారని వెల్లడించారు.

Tags:    

Similar News