UP: ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌.

24 మంది మావోయిస్టుల మృతి, 15 మృతదేహాలు స్వాధీనం;

Update: 2025-01-22 00:39 GMT

దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య యుద్ధం నడుస్తున్నది. ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు ధ్రువీకరించారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత చలపతి ఉన్నారు. ఒడిశాలోని నువాపాడ జిల్లా సరిహద్దును ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌ జిల్లా మేయిన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇక్కడ మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం అందడంతో ఒడిశా స్పెషల్‌ ఆపరేషన్‌, ఛత్తీస్‌గఢ్‌ డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా బెటాలియన్లకు చెందిన సుమారు వెయ్యి మందికిపైగా భద్రతా దళాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఇరువర్గాల మధ్య గంటల వ్యవధిలో నాలుగైదుసార్లు భీకర పోరు జరిగింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది.

మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జయరామ్‌ అలియాస్‌ చలపతి మృతి చెందారు. ఆయనతో పాటు మరో అగ్రనేత సైతం మృతిచెందినట్టు సమాచారం. చలపతిపై కోటి రూపాయల రివార్డు ఉంది. సోమవారం ఇదే అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ మృతు ల్లో నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన పాక మంతయ్య అలియాస్‌ హన్మంతు (65) ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన గ్రామానికి చెందిన పాక చంద్రయ్య, ఎట్టమ్మ దంపతుల కుమారుడు. విద్యార్థి దశలో రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌లో పని చేసిన హన్మంతు 1981లో మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు.

వేగం పుంజుకున్న ‘కగార్‌’

ఆపరేషన్‌ ‘కగార్‌’ మరింత వేగాన్ని పుంజుకుంది. ఇప్పటికే మావోయిస్టులకు షెల్టర్‌ జోన్‌గా మారిన అబూజ్‌మడ్‌ అడవులను వేలాది మంది సాయుధ బలగాలు జల్లెడ పడుతూ దాదాపు వారి స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఎన్‌కౌంటర్లలో గత 21 రోజుల్లోనే సుమారు 40 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.

నక్సల్‌ విముక్త భారత్‌ దిశగా కీలక విజయం: అమిత్‌ షా

ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ‘ఎక్స్‌’లో స్పందించారు. ఇది నక్సలిజానికి భారీ ఎదురుదెబ్బ అని, నక్సల్‌ విముక్త భారత్‌ నిర్మాణం దిశగా మన భద్రతా బలగాలు సాధించిన కీలక విజయమని ఆయన పేర్కొన్నారు. ఒడిశా-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో సీఆర్పీఎఫ్‌, ఒడిశా ఎస్‌ఓజీ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ఉమ్మడి ఆపరేషన్‌ జరిపి 14 మంది నక్సలైట్లను హతమార్చారని ఆయన తెలిపారు. నక్సల్‌ విముక్త భారత్‌ దిశగా తమ లక్ష్యం, భద్రతా బలగాల సంయుక్త ప్రయత్నాలతో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు.

Tags:    

Similar News