UttaraKhand: ట్రాన్స్ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం
చమోలీ జిల్లాలో అలకనంద నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన దగ్గర ఘటన;
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో కరెంట్షాక్కుగురై 15 మంది మృతి చెందారు. మృతుల్లో పోలీసులు కూడా ఉన్నారు. ఘటనలో పలువురు గాయపడ్డారు. చమోలీ జిల్లాలోని అలకనందా నదిపై ఉన్న నిర్మాణంలో ఉన్న వంతెన దగ్గర ఈ ప్రమాదం జరిగింది. నమామీ గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనందా నదిపై ఉన్న వంతెనకు విద్యుత్ ప్రవాహం జరగడం వల్ల ఈ ఘోరం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం వల్ల వంతెన రెయిలింగ్కు విద్యుత్ ప్రవహించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మృతి చెందిన వారిలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, హోం గార్డులు ఉన్నారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోంది. రెయిలింగ్కు విద్యుత్ ప్రవాహం జరగడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్టు ఉత్తరాఖండ్ అధికారులు వెల్లడించారు. పీపల్కోటి అవుట్ పోస్టు ఇంఛార్జి కూడా మృతి చెందినవారిలో ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదం నిన్న రాత్రి జరిగిందని చమోలీ ఎస్పీ ప్రమేంద్ర ఢోబాల్ తెలిపారు. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. అలాగే ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విద్యుత్ విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ.. వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.