Encounter: బీజాపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఇద్దరు మావోస్టులు మరణించారు. బీజాపూర్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోస్టులు తారపడటంతో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసుల ఫైరింగ్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలంలో 303 రైఫిల్తోపాటు ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో కాలులు ఇంకా కొనసాగుతున్నాయని, మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.
కాగా, గరియాబంద్ జిల్లాలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. మైన్పూర్ పోలీస్స్టేషన్ పరిధి భాలూ డిగ్గి సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసు అధికారులకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.
దీంతో కోబ్రా, గరియాబంద్ జిల్లాకు చెందిన ఈ-30, స్పెషల్ టాస్క్ఫోర్స్(ఎస్టీఎఫ్) భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగడంతో ఇరువర్గాల మధ్య భీకరపోరు సాగింది. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు.
అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతోపాటు వారికి సంబంధించిన ఆయుధ, వస్తు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, మృతిచెందిన వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ అలియాస్ భాస్కర్తోపాటు ఒడిశా రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు(ఎస్జెడ్సీఎం) ప్రమోద్ అలియాస్ పాండు మృతిచెందినట్లుగా పోలీస్ అధికారులు తెలిపారు.