Operation Sindhu: కొనసాగుతున్న ఆపరేషన్ సింధు..
224 మందితో ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న మరో విమానం;
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ సింధు’ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ ద్వారా ఇజ్రాయెల్, ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకొస్తోంది.
పొరుగు దేశాలకు చెందిన పౌరులకు కూడా భారత్ ఆపరేషన్ సింధు ద్వారా సాయం చేస్తోంది. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటికే పలువురు భారతీయులు స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్ నుంచి 224 మంది భారతీయులతో కూడిన భారత వాయుసేనకు చెందిన విమానం (IAF aircraft) ఢిల్లీకి చేరుకుంది. వారికి పాలెం విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. ఈ ఆపరేషన్లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి ఇప్పటి వరకూ 818 మందిని కేంద్రం స్వదేశానికి తరలించింది.
మరోవైపు ఇరాన్ నుంచి 11వ విమానం ఇవాళ తెల్లవారుజామున ఢిల్లీలో ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. 282 మంది భారతీయులు క్షేమంగా స్వదేశానికి తిరిగొచ్చారు. ‘జూన్25న తెల్లవారుజామున మాషా (ఇరాన్) నుంచి 282 మంది భారతీయులతో ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. దీంతో ఇప్పటి వరకూ ఇరాన్ నుంచి 2,858 మందిని స్వదేశానికి తీసుకొచ్చాం’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్లో పోస్టు పెట్టింది. ఇందులో పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంకకు చెందిన వారు కూడా ఉన్నారు.