Rajasthan: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
రెండు కార్లు ఢీకొనడంతో;
రాజస్థాన్ హైవేపై రెండు కార్లు ఢీకొనడంతో ఆరుగురు మృతి, పలువురికి గాయాలయ్యాయి. సికార్ నుంచి లక్ష్మణ్గఢ్ వైపు వెళ్తున్న కారు డివైడర్ను దాటి రోడ్డుకు అవతలివైపు ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటన అనంతరం క్షతగాత్రులను సికార్లోని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులను జైపూర్లోని ఆసుపత్రికి తరలించారు. ‘‘లక్ష్మణ్గఢ్ శివార్లలోని హైవేపై బొలెరో, ఎర్టిగా కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు, మరొకరు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మరణించారు. మరో ఐదుగురు వ్యక్తులు కూడా గాయపడ్డారు’’ అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధర్మారామ్ చెప్పారు. లక్ష్మణ్గఢ్లో మకర సంక్రాంతి పండుగ జరుపుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రమాద ఘటన తర్వాత సికార్లోని లోక్సభ ఎంపీ సుమేధానంద్ సరస్వతి, సంబంధిత ప్రాంత ఇన్స్పెక్టర్ జనరల్ సత్యేంద్ర సింగ్ కళ్యాణ్ ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారని ఎంపీ సరస్వతి చెప్పారు.