Bomb threats: ఢిల్లీ స్కూళ్లకు మళ్లీ బాంబ్ బెదిరింపులు..
ఆందోళనలు విద్యార్థులు, తల్లిదండ్రులు;
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. సోమవారం నుంచి వరుసగా ఢిల్లీ స్కూళ్లకు బెదిరింపులు వస్తున్నాయి. ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. సోమవారం 30 స్కూళ్లకు బెదిరింపులు రాగా.. విద్యార్థులను బయటకు పంపేసి సోదాలు చేశారు. ఏమీ లేనట్టుగా తేల్చారు. ఇక బుధవారం 50 స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఇది నకిలీదిగా తేల్చారు. తాజాగా గురువారం ఐదు స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం విద్యార్థులను బయటకు పంపి తనిఖీలు చేస్తున్నారు.
గురువారం ఢిల్లీలోని ప్రసాద్ నగర్, ద్వారకా సెక్టార్ 5 సహా ఐదు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి, దీంతో పోలీసులు, అగ్నిమాపక శాఖ వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బీజీఎస్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర్ స్కూల్, గ్లోబల్ స్కూల్ వంటి విద్యాసంస్థలు ద్వారకలోనే ఉన్నాయి. విద్యార్థులను ఇంటికి పంపించి సెలవు ప్రకటించారు.
వరుస బాంబ్ బెదిరింపులతో అటు విద్యార్థులు.. ఇటు తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంటోంది. ఇంకోవైపు అధికారులు ఉరుకులు.. పరుగులు పెట్టిస్తున్నాయి. చివరికి నకిలీ బాంబ్గా తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ బాంబ్ బెదిరింపులు కారణంగా తరగతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.