Uttarakhand: హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ 9 మంది మృతి
ఇంకా అనేక మంది అక్కడే;
హిమాలయ పర్వతాలలో విషాదం చోటుచేసుకుంది. ట్రెక్కింగ్ చేస్తూ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సహస్రతల్ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మరికొంత మంది మంచులో చిక్కుకుపోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు స్థానిక గైడ్లతో పాటు కర్ణాటకకు చెందిన 18 మంది ట్రెక్కర్లు, మహారాష్ట్రకు చెందిన ఒకరు హిమాలయాల్లో 4,100-4,400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతల్ ఆల్పైన్ సరస్సు దగ్గర బుధవారం ట్రెక్కింగ్ చేస్తున్నారు. హఠాత్తుగా మంచులో చిక్కుకుపోయారు. వీరిలో తొమ్మిది మరణించగా మరో 9 మంది జాడ తెలియలేదని అధికారులు తెలిపారు.
అటవీ శాఖకు చెందిన 10 మంది సభ్యుల రెస్క్యూ టీమ్, ఎస్డీఆర్ఎఫ్ బృందం బుధవారం తెల్లవారుజామున ఉత్తరకాశీ నుంచి బయలుదేరాయని పేర్కొన్నారు. ఉత్తరకాశీ జిల్లా ఆసుపత్రి, భట్వాడీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేశామని, 14మంది రక్షణ సిబ్బంది, ఒక వైద్యుడిని ఘటనా స్థలానికి పంపామని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే తరలించడానికి హెలికాప్టర్, అంబులెన్స్లను సిద్ధం చేశామన్నారు.