J&K Assembly Poll: జమ్మూ & కాశ్మీర్లో తొలి విడత ఎన్నికలు
24 నియోజకవర్గాలకు పోలింగ్;
జమ్ముకశ్మీర్లో 10 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతంలో నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది. మొదటి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏడు జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో 219 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కశ్మీర్లో 16, జమ్ములో 8 స్థానాల్లో 3 వేల 276 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు. 23 లక్షల 27 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎల్వోసీ దగ్గరున్న పోలింగ్ స్టేషన్ల దగ్గర అదనపు బలగాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. స్థానిక పోలీసులతో పాటు అదనంగా 300 కంపెనీల పారామిలిటరీ బలగాలను ఈ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతానికి మరాజ్ రీజియన్లోని అనంత్ నాగ్, పుల్వామా, కుల్గాం, షోపియాన్ జిల్లాలు, చీనాబ్ లోయలోని డోడా, కిశ్త్ వాద్, రాంబన్ జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్పుర, జైనాపుర, షోపియాన్, డీహెచ్ పుర, కుల్గాం, దేవ్సర్, దూరు, కోకెర్నాగ్, అనంత్ నాగ్ వెస్ట్, అనంత్ నాగ్, శ్రీగుఫ్వారా – బిజ్బెహరా నియోజకవర్గాలు కీలకంగా ఉన్నాయి. బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఎన్సీతో కాంగ్రెస్ పొత్తులో ఉంది.
కాగా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కేంద్రపాలిత ప్రాంతంలోని పౌరులు “పెద్ద సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగ”ను జరుపుకోవాలని అన్నారు. ముఖ్యంగా యువకులు, మొదటిసారి ఓటర్లు, మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి.. మీరు వేసే ఓటు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోడీ చేసిన ట్వీట్లో పేర్కొన్నారు.