Blast: బాణసంచా గోదాంలో పేలుడు.. 21కి చేరిన మృతులు
గుజరాత్లో ఘోర అగ్ని ప్రమాదం;
గుజరాత్లోని దీసా పట్టణానికి సమీపంలోని పటాకుల గోదాములో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్కు చెందిన 21 మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు దుర్మరణం చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బాయిలర్ పేలడంతో గోదాము పైకప్పు, కొన్ని గోడలు కూలిపోయాయని జిల్లా ఎస్పీ తెలిపారు. అగ్నిమాపక శాఖ వెంటనే మంటలను అదుపు చేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు గుజరాత్ సీఎం రూ.4 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
పేలుడు తర్వాత గోడౌన్ స్లాబ్ కూలిపోవడంతో ప్రాణనష్టం సంభవించిందని ఎస్పీ అక్షయ్రాజ్ మక్వానా తెలిపారు. పేలుడుకు గల కారణాన్ని తెలుసుకొనేందుకు ఫోరెన్సిక్ బృందాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఈ గోదాంలో అక్రమంగా బాణసంచా నిల్వ చేస్తున్నారని తేలింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. డిప్యూటీ ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీసా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) నేహా పంచల్ మాట్లాడుతూ.. గోదాంలో మొదట్లో బాణసంచా నిల్వ చేసేందుకు లైసెన్స్ ఉందని.. కానీ డిసెంబర్ 31, 2024న గడువు ముగిసిన తర్వాత లోపాల కారణంగా దాన్ని పునరుద్ధరించలేదన్నారు. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత వారు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. యూనిట్లో సరైన సౌకర్యాలు లేవని అధికారులు గుర్తించి.. లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియ నిలిపివేసినట్లు తెలిపారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సహాయ నిధి నుంచి రూ.2లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. క్షతగాత్రులకు చెరో రూ.50వేలు చొప్పున ప్రకటించారు. మరోవైపు, మధ్యప్రదేశ్ సీఎం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రం నుంచి కార్మికులు అక్కడ మృతిచెందడంతో వారికి రూ.2లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున సాయం ప్రకటించారు.