Arvind Kejriwal: కేజ్రీవాల్ను కలిసేందుకు భార్యకు నో పర్మిషన్..
అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ;
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమయ్యేందుకు ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్కు తీహార్ జైలు అధికారులు అనుమతిని నిరాకరించారు. షెడ్యూలు ప్రకారం వీరిద్దరి భేటీ సోమవారం జరగవలసి ఉంది. ఎటువంటి కారణం చూపకుండానే సునీతకు అనుమతిని తిరస్కరించారని ఆప్ వర్గాలు మీడియాకు తెలిపాయి. అయితే ఢిల్లీ రాష్ట్ర మంత్రి, ఆప్ నేత ఆతిశీ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అరవింద్ కేజ్రీవాల్ను జైలులో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కేజ్రీవాల్ను కలిసేందుకు సునీత, ఆతిశీలకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారని, కానీ ఆ తర్వాత సునీతకు అనుమతిని తిరస్కరించారని ఆప్ వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణంలో జరిగిన మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ (సోమవారం) విచారణ చేపట్టనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఈ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేయడం స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు, సమాఖ్య వాదంపై ఆధారపడిన ప్రజాస్వామ్య సూత్రాలపై దాడి అని కేజ్రీవాల్ గతంలో సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇక, ఈ కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈడీ కౌంటర్ అఫిడవిట్పై కేజ్రీవాల్ స్పందిస్తూ.. లోక్సభ ఎన్నికలకు ముందు మోడల్ ప్రవర్తనా నియమావళిని విధించడంతో తనను అరెస్టు చేసిన విధానం ఏకపక్షంగా ఉందని చెప్పారు. తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని అతడు చెప్పుకొచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీని, దాని నాయకులను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈడీ, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాని విస్తృత అధికారాలను దుర్వినియోగం చేసింది అని ఆరోపించారు. కాగా, సిట్టింగ్ ముఖ్యమంత్రి, ఇండియా కూటమిలోని ఒకపార్టీకి జాతీయ కన్వీనర్గా ఉన్న తనను ఈడీ తప్పుగా ఎంపిక చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అతని అరెస్టు స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు చాలా అవసరం అని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.