Rajyasabha MP : టమాట దండతో రాజ్యసభకు

ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్

Update: 2023-08-10 03:00 GMT

టమాటా రేట్లు సెంచరీ దాటి చాలా రోజులు అయ్యింది. డబల్ సెంచరీలకు చేరువైపోతోంది. పెరుగుతున్న టమాటాల రేట్లపై ప్రతిపక్షాలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టమాట రేట్లపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ గుప్త. టమాటాలతో ఓ దండ తయారు చేయింది, అది వేసుకొని ఆ రాజ్యసభకు హాజరయ్యారు. ఆయన వాలకం చూసి తోటి సభ్యులు నవ్వుకున్నారు, కానీ ఆయన అందరి దృష్టిలో పడ్డారు. సోషల్ మీడియాలో ఆ వార్త వైరల్ గా మారింది. అయితే సభకు టమాటాల దండతో రావడం సరికాదంటూ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశీల్‌ కుమార్‌ తీరు తనకు ఎంతో బాధ కలిగించిందని, బాధ్యతగల పార్లమెంట్ సభ్యుడు జనం దృష్టిని ఆకర్షించేందుకు ఇలాంటి పనులు చేయడం సరికాదన్నారాయన. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రతిపక్ష నాయకుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. అయితే తమ పార్టీ ఎంపీ సుశీల్ కుమార్ గుప్త టమాటాల దండతో పార్లమెంట్ కు వెళ్లిన వీడియోని చాలా చాలా పాజిటివ్ గా తీసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసి ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసింది.

ప్రభుత్వం చేతగాని తనం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని అన్నది. ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. అయితే ఎంపీ సుశీల్ కుమార్ గుప్తపై చైర్మన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో మాత్రం వేచి చూడాల్సిందే.. ఎందుకంటే ఇలాంటి సంఘటన ఇదే మొదలు కాదు. గతంలో పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు, గ్యాస్ పెరిగినప్పుడు కూడా ఇలా ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు హడావిడి చేసి మీడియాను ఆకర్శించేవారు అన్న విషయం తెలిసిందే..

Tags:    

Similar News