ACB: కిటికీ నుంచి రూ. 2 కోట్లు బయటపడేసిన అవినీతి అధికారి
విజిలెన్స్ అధికారుల రాకతో వెదజల్లిన ఇంజినీర్;
ఒడిశాలోని ఓ ప్రభుత్వ ఇంజినీర్ ఫ్లాట్ కిటికి నుంచి నోట్ల వర్షం కురిసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్కు చెందిన చీఫ్ ఇంజినీర్ బైకుంఠనాథ్ సారంగి ఇంటిపై దాడిచేశారు. వారు వస్తున్న విషయం తెలుసుకున్న సారంగి అధికారులకు పట్టుబడకూడదన్న ఉద్దేశంతో భవనేశ్వర్లోని తన ఫ్లాట్ కిటికి నుంచి రూ.500 నోట బండిళ్లను బయటకు విసిరేశాడు.
ప్రజలకు సేవా చేయాల్సిన ప్రభుత్వాధికారులు లంచాలకు పడగలెత్తుతున్నారు. కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. అవినీతి అధికారులపై ఏసీబీ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో లంచం పుచ్చుకుంటూ పట్టుబడుతున్నారు. తాజాగా మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. కాగా ఏసీబీ అధికారులు సోదాలకు వచ్చారన్న విషయం తెలిసి కిటికీలోంచి ఏకంగా రూ. 2 కోట్లను బయటపడేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై భువనేశ్వర్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ సారంగి అంగుల్లోని నివాసం, రాష్ట్రంలోని మరో మూడు ప్రదేశాలతో సహా నాలుగు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. అంగుల్, పూరి, కటక్, దెంకనల్ విజిలెన్స్ విభాగాలు సంయుక్తంగా ఈ దాడులను నిర్వహిస్తున్నాయి. చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ షాడంగి ఇంట్లో విజిలెన్స్ బృందం రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. అంగుల్లోని అతని ఇంటి నుంచి రూ.90 లక్షలు, రాజధానిలోని అతని నివాసం నుంచి రూ.1.10 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
అంగుల్లోని విజిలెన్స్ ప్రత్యేక న్యాయమూర్తి జారీ చేసిన సెర్చ్ వారెంట్ ఆధారంగా, ఒడిశా విజిలెన్స్ విభాగం నేతృత్వంలోని ఒడిశా విజిలెన్స్, భువనేశ్వర్, పిపిలి (పూరి)లోని 7 ప్రదేశాలలో 8 మంది డిఎస్పీలు, 12 మంది ఇన్స్పెక్టర్లు, 6 మంది ఎఎస్ఐలు, ఇతర సహాయక సిబ్బందితో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ షాడంగి రెండు రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇంజనీర్ ఇంటిపై దాడి జరిగినప్పుడు, విజిలెన్స్ అధికారులు వచ్చేసరికి సారంగి తన ఫ్లాట్ కిటికీలోంచి నగదు కట్టలను విసిరి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ డబ్బును తరువాత సాక్షుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.