Agniveer: అగ్నివీర్ అజయ్ కుటుంబానికి రూ.98.39 లక్షలు చెల్లించాం: సైన్యం

రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన ఆర్మీ;

Update: 2024-07-04 04:30 GMT

లోక్‌సభ ఎన్నికల అనంతరం పార్లమెంట్ తొలి సమావేశాలు ముగిశాయి. అమరవీరులైన అగ్నిమాపక సిబ్బంది కుటుంబాలకు పరిహారం ఇచ్చే అంశంపై పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అబద్ధాలు చెప్పారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఇండియన్ ఆర్మీ అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్(ADGPI)కీలక ప్రకటన చేసింది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్‌ అజయ్‌కుమార్‌ కుటుంబ సభ్యులకు పరిహారం అందలేదని సోషల్‌ మీడియాలో కొన్ని పోస్టులు వెల్లువెత్తుతున్నాయని పేర్కొంది. అగ్నివీర్ అజయ్ కుమార్ చేసిన అత్యున్నత త్యాగానికి భారత సైన్యం సెల్యూట్ చేస్తోందని ఉద్ఘాటిస్తున్నట్లు ఏడీజీపీఐ తెలిపింది. అలాగే అగ్నివీర్ అజయ్ కుటుంబ సభ్యులకు ఇప్పటికే రూ.98.39లక్షలు చెల్లించినట్లు సైన్యం తెలిపింది.

‘‘అగ్ని వీరుడు విజయ్ కుమార్‌ కుటుంబానికి పరిహారం చెల్లించలేదంటూ ఇటీవల వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. అగ్నివీరుడి కుటుంబానికి చెల్లించాల్సిన మొత్తంలో రూ.98 లక్షలను ఇప్పటికే అందజేశాం. అగ్నివీర్ పథకం నిబంధనల ప్రకారం, ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇతర బెనిఫిట్స్‌ కలిపి రూ.67 లక్షలను పూర్తి సెటిల్మెంట్, పోలీస్ వెరిఫికేషన్ తరువాత చెల్లిస్తాం. మొత్తం పరిహారం రూ.1.65 కోట్లు’’ అని ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. పరిహారాన్ని అమరుడైన అగ్నివీరుడి కుటుంబానికి తక్షణం చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.

విధి నిర్వహణలో అమరుడైన అగ్నివీరుడు అజయ్‌ కుమార్‌ కుటుంబానికి చెల్లించాల్సిన పరిహారం విషయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అసత్యమాడారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా మండిపడ్డ విషయం తెలిసిందే. అగ్నివీరులను ప్రభుత్వం వాడుకుని పారేసే కార్మికులుగా చూస్తోందని లోక్‌సభలో రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌కు బదులిచ్చిన రాజ్‌నాథ్ సింగ్.. సభను తప్పుదోవ పట్టించొద్దని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అగ్నివీరుల కుటుంబాలకు పరిహారం కింద రూ.కోటి లభిస్తుందని తెలిపారు.

నాలుగేళ్ల పాటు ఆర్మీలో పనిచేసేందుకు కేంద్రం 2022 జూన్ 14న అగ్నివీర్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 17 ఏళ్ల నుంచి 21 మధ్య ఉన్న వారిని నాలుగేళ్ల పాటు సైన్యంలో పనిచేసేందుకు ఈ పథకం ద్వారా ఎంపిక చేస్తారు. అగ్నివీరుల్లో తగిన అర్హత గల వారిని మరో 15 ఏళ్ల పాటు ఆర్మీలో కొనసాగిస్తారు. అయితే, ప్రభుత్వం గతేడాది ఈ పథకానికి సంబంధించిన గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచింది

Tags:    

Similar News