Air India Plane: లండన్ వెళ్తూ.. వెనక్కి వచ్చేసిన ఎయిర్ ఇండియా విమానం!..3 గంటల పాటు గాల్లోనే
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలే కారణం;
ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఓ ఎయిర్ ఇండియా విమానం కొన్ని గంటలకే వెనక్కి వచ్చేసింది. ముంబై విమానాశ్రయం నుంచి శుక్రవారం తెల్లవారుజామున 5.39 గంటలకు ఎయిర్ ఇండియా ఏఐసీ 129 విమానం లండన్కు బయల్దేరింది. 3 గంటల పాటు గాల్లోనే ఉన్న విమానం.. తిరిగి ముంబైకి చేరుకుంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విమానం తిరిగి ముంబై వచ్చిందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. దీంతో ఆ ప్రాంతంలో పలు చోట్ల గగనతలాలపై ఆంక్షలు విధించారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా పలు విమానాలను దారి మళ్లించారు. కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ క్రమంలో లండన్ వెళ్లాల్సిన ఏఐసీ 129 విమానం తిరిగి ముంబైకి చేరుకుందని ఎయిర్ ఇండియా పేర్కొంది. కొన్ని విమానాలను దారి మల్లించాం అని ఎయిర్ ఇండియా తెలిపింది. గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలగా.. 241 మంది మృతి చెందారు.