Ajit Pawar Plae Crash: అజిత్ పవార్ విమానం బ్లాక్ బాక్స్ లభ్యం- వేగంగా దర్యాప్తు పూర్తి చేస్తాం : కేంద్రం
రంగంలోకి ఏఏఐబీ, డీజీసీఏ నిపుణుల టీమ్
బారామతిలో జరిగిన అజిత్ పవార్ విమాన ప్రమాదం దర్యాప్తు జోరందుకుంది. తాజాగా కీలక సమాచారం వెలువడింది. బుధవారం ఉదయం కూలిన లియర్జెట్ విమానానికి సంబంధించిన “బ్లాక్ బాక్స్”ను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదానికి ముందు ఏం జరిగింది? ఈ ప్రమాదం వెనుక అసలు కారణం ఏమిటో చెప్పే ప్రధాన ఆధారమైన బ్లాక్ బాక్స్ ఎట్టకేలకు చిక్కింది. బ్లాక్ బాక్స్ అంటే ఒకటి కాదు.. రెండు భాగాల సమాహారం. మొదటిది ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుంది. రెండో దానిలో కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంది. విమానం ఎంత వేగంతో వెళ్లింది? కూలే సమయంలో ఎంత ఎత్తులో ఉంది? పైలట్లు ఏం మాట్లాడుకున్నారు? చివరి క్షణాల్లో ఏమి జరిగింది? ఇవన్నీ ఇందులో రికార్డ్ అయి ఉంటాయి. ప్రస్తుతం అధికారులు ఈ రెండు రికార్డర్లను విశ్లేషించనున్నారు. ఆ తర్వాతే ప్రమాదానికి దారి తీసిన నిజమైన కారణం బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థ నిర్వహిస్తున్న లియర్జెట్ 45 విమానం, బారామతి విమానాశ్రయంలో రెండోసారి ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్న సమయంలో ఉదయం సుమారు 8:45కి కూలిపోయింది. ఆ రోజు ఉదయం అజిత్ పవార్ ముంబై నుంచి సుమారు 8 గంటల సమయంలో బయలుదేరారు. బారామతిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా, తన స్వస్థలంలో నాలుగు సభలను ఉద్దేశించి మాట్లాడాల్సి ఉంది. కానీ ఆ ప్రయాణమే చివరి ప్రయాణంగా మారింది.
ఏడీఆర్ నమోదు చేసిన పోలీసులు
త్వరలో మహారాష్ట్రలో జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో బారామతి పరిధిలో ఎన్నికల ప్రచారం చేసేందుకు బుధవారం ఉదయం ముంబయి నుంచి బారామతికి లీయర్ జెట్45 విమానంలో 66 ఏళ్ల అజిత్ పవార్ బయలుదేరారు. కానీ బారామతి ఎయిర్పోర్టులోని రన్వేపై ల్యాండింగ్ కావడానికి కొన్ని సెకన్ల ముందు విమానం పేలిపోయింది. దీంతో విమానంలో ఉన్న అజిత్ పవార్, మరో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై బారామతి తాలూకా పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్టు (ఏడీఆర్)ను నమోదు చేశారు.