Amarnath Yatra: అమర్నాథ్ యాత్ర 38 రోజులే..
జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు;
అమర్నాథ్ యాత్రను ఈ ఏడాది జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు కేవలం 38 రోజులు మాత్రమే నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. పహాల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో 26 మంది యాత్రికులు మృతిచెందగా, ప్రభుత్వం రక్షణ కారణాలు చూపుతూ ఈ నిర్ణయం తీసుకుంది. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో 50 వేల మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, జమ్ము కశ్మీర్ పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. బలగాల వాహనాల రాకపోకల కోసం ఆయా మార్గాల్లో ప్రత్యేకంగా జామర్లను ఏర్పాటు చేశారు. యాత్రికులు ప్రయాణించే మార్గంలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆ ఉగ్రవాదులతో టెన్షన్
అయితే, అమర్నాథ్ యాత్ర పూర్తిగా జమ్మూ కశ్మీర్ లో సాగునుండటం హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆ రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం వరకూ దారి తీసింది. ఇప్పటికీ కశ్మీర్లో టెర్రరిస్టుల వేట కొనసాగుతోంది. పహల్గాంలో 26 మంది హిందువులను కాల్చి చంపిన నలుగురు ఉగ్రవాదులు ఇప్పటికీ దొరకలేదు. వాళ్లు ఇంకా తప్పించుకుని తిరుగుతున్నారు. గత రెండేళ్లుగా ఆ నలుగురు కశ్మీర్లోనే ఉంటూ మూడు దాడులకు తెగపడ్డారు. యావత్ దేశాన్ని షేక్ చేసిన పహల్గాం అటాక్ తర్వాత కూడా వాళ్లంతా ఇప్పటికీ ప్రాణాలతో ఉండటం.. ఆర్మీకి చిక్కకుండా నక్కడం.. అమర్నాథ్ యాత్రకు డేంజర్ సిగ్నల్స్ మోగిస్తోంది. అందుకే, భద్రతా బలగాలు యాత్రకు మరింత టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నాయి.
ఏనీ టైమ్ రెడీ..
భక్తుల భద్రతకి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్. పహల్గాం, జమ్ము, బేస్ క్యాంపులు, యాత్ర నివాస్ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 581 కంపెనీల CRPF బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పారు. అమర్నాథ్ యాత్ర సమయంలో భక్తుల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా.. జాతీయ రహదారులను తాత్కాలికంగా మూసేస్తున్నామన్నారు. యాత్ర మార్గాల్లో రోడ్డు ఓపెనింగ్ పార్టీలు , క్విక్ యాక్షన్ టీమ్స్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్, కె9 డాగ్ యూనిట్లు, డ్రోన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు భయపడాల్సిన పని లేదని.. ఇండియన్ ఆర్మీపై నమ్మకంతో యాత్ర కొనసాగించాలని పిలుపు ఇచ్చారు.