ప్రధాని మోడీ ఇటీవల సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా అమిత్ షా కూడా సరికొత్త రికార్డ్ను నెలకొల్పారు. ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పని చేసిన రికార్డ్ను మోడీ సొంతం చేసుకున్నారు. తాజాగా అమిత్ షా కూడా ఆగస్టు 5తో సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం హోంమంత్రిగా పని చేసిన రికార్డ్ను అమిత్ షా సొంతం చేసుకున్నారు.
కేంద్రంలో ఎక్కువ కాలం హోంమంత్రిగా పని చేసిన వ్యక్తిగా అమిత్ షా మంగళవారం రికార్డును బద్దలు కొట్టారు. బీజేపీ అగ్ర నేత లాల్ కృష్ఱ అద్వానీ రికార్డ్ను ఆగస్టు 5న అమిత్ షా బద్దలు కొట్టారు. అద్వానీతో పాటు కాంగ్రెస్కు చెందిన గోవింద్ వల్లభ్ పంత్ ఆరు సంవత్సరాలకు పైగా హోం మంత్రి పదవిని నిర్వహించారు. మోడీ 1.0 పాలనలో హోం మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ఐదు సంవత్సరాలు పని చేశారు. తాజాగా అమిత్ షా.. ఆరు సంవత్సరాల 64 రోజుల పాటు హోంమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.
2019లో మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక కూడా హోంమంత్రిగానే అమిత్ షా కొనసాగుతున్నారు. ఇలా ఆరు సంవత్సరాల 64 రోజుల పాటు హోంమంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో అద్వానీ, గోవింద్ వల్లభ్ పంత్ రికార్డ్ను అధిగమించారు. ఇక హోంమంత్రిగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్, లడఖ్లను రెండు ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, దేశంలో నక్సలిజం నిర్మూలన వంటి అనేకమైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇక మోడీ కేబినెట్లో చేరకముందు బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా అనేక ఎన్నికల్లో విజయం సాధించారు. అస్సాం, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో తనదైన ముద్ర వేశారు. ఇక 2017లో 15 సంవత్సరాల తర్వాత ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకోవడంతో అమిత్ షా.. రాజ్నాథ్ సింగ్ స్థానంలో దేశ హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి ఇప్పటివరకు హోంమంత్రిగా అమిత్ షా కొనసాగుతున్నారు.