Rajasthan: బాయ్ఫ్రెండ్తో కలిసి భర్తను హత్య చేయించిన భార్య..
రాజస్థాన్ మర్డర్ కేసులో షాకింగ్ డిటేల్స్
రాజస్థాన్(Rajasthan)లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో షాకింగ్ విషయాలు తెలిశాయి. మేఘాలయాలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసు తరహాలో ఆ ఘటన ఉన్నది. శ్రీగంగానగర్లో జనవరి 30వ తేదీన ఓ ఘటన జరిగింది. కొత్తగా పెళ్లి అయిన ఆశిష్, అంజూ అనే జంట ప్రమాదానికి గురైంది. హిట్ అండ్ రన్ కేసులో ఆశిష్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అంజూ స్పృహ తప్పిపడిపోయింది. ఆమె వద్ద ఉన్న మొబైల్, నగలు దోపిడీకి గురయ్యాయి. అయితే ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన రాజస్థానీ పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. భార్యే భర్తను చంపించినట్లు పోలీసులు తేల్చారు. మేఘాలయాలో జరిగిన రాజా రఘువంశీ హనీమూన్ మర్డర్ కేసు తరహాలో ఈ కేసు ఉన్నట్లు గుర్తించారు.
బాయ్ఫ్రెండ్ సంజూతో కలిసి భార్య అంజూ తన భర్త ఆశిష్ను హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మర్డర్లో మరో ఇద్దరు కూడా ఉన్నారు. ఆ హత్యను ఓ రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. జనవరి 30వ తేదీన రోడ్డుపై రాత్రి 9 గంటల సమయంలో ఓ జంట స్పృహ కోల్పోయి పడి ఉన్నట్లు ఫోన్ వచ్చిందని ఎస్పీ అమృతా దుహన్ తెలిపారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ జంటను కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లారు. అయితే ఆశిష్ మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్ల తన భర్త చనిపోయినట్లు భార్య అంజూ ఫిర్యాదు చేశారు. ఈవినింగ్ వాకింగ్ వెళ్లన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆమె చెప్పింది. తాను ధరించిన బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నది.
కానీ ఈ కేసులో పోలీసులు కూపీ లాగారు. దర్యాప్తు సమయంలో అనుమానాలు రావడంతో అంజూను ప్రశ్నించారు. ఆశిష్ శరీరంపై గాయాలు ఉండడం వల్ల పోలీసులకు అనుమానం పెరిగింది. గొంతు నొక్కి చంపినట్లు మెడికల్ రిపోర్టులో తేలింది. కానీ భార్య అంజూకు మాత్రం ఎటువంటి గాయాలు లేవు. అంజూ ఫోన్ను పోలీసులు స్కాన్ చేశారు. ఆమె తరుచూ సంజూతో కాంటాక్టులో ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఇంటి వద్దే అతను నివసించేవాడని తెలిసింది. అంజూ, ఆశిష్కు మూడు నెలల క్రితమే పెళ్లి జరిగింది. కానీ స్వంత ఇంటికి వెళ్లిన ఆమె తన బాయ్ఫ్రెండ్ సంజూతో కలిసి ఆశిష్ మర్డర్కు ప్లాన్ చేసింది. భర్తతో కలిసి డిన్నర్ తర్వాత వాకింగ్కు వెళ్లడం అలవాటు చేసుకున్నది.
ఇక జనవరి 30వ తేదీన అనుకున్నట్లు బయటకు వెళ్లారు. అక్కడే సంజూతో పాటు రోహిత్, బాదల్ అనే మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆశిష్ను చంపేశారు. దారుణంగా కొట్టి, గొంతు నొక్కి చంపారు. ఆ మర్డర్ను రోడ్డు ప్రమాదంలా చూపించే ప్రయత్నం చేశారు. ఇక దొంగతనం జరిగిందన్న కోణాన్ని ప్రెజెంట్ చేసేందుకు అంజూ తన వద్ద ఉన్న ఫోన్, నగలను సంజూకు ఇచ్చేసింది. దాడి తర్వాత స్పృహ కోల్పోయినట్లు నటించింది. తరుచూ తన స్టేట్మెంట్లను మార్చడం వల్ల అంజూ తీరుపై పోలీసులకు మరింత అనుమానం పెరిగింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే ఈ కేసును మేఘలాయా హనీమూన్ మర్డర్ కేసుతో పోల్చుతున్నారు. మధప్రదేశ్కు చెందిన కొత్త జంట గత ఏడాది హనీమూన్ పేరుతో మేఘాలయాకు వెళ్లారు. అక్కడ తన బాయ్ఫ్రెండ్తో కలిసి భర్తను సోనమ్ హత్య చేయించిన విషయం తెలిసిందే. అదే తరహా డ్రామా రాజస్థాన్లో జరిగినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు.