Assam tension: అస్సాంలో ఉద్రిక్తతలు..రెచ్చగొట్టే పోస్టర్లతో జిల్లాలో ఉద్రిక్తత

ధుబ్రిలో ‘కొత్త బీఫ్ మాఫియా’ ఆవిర్భావంపై విచారణకు ఆదేశం;

Update: 2025-06-14 04:45 GMT

అస్సాంలోని బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా ధుబ్రిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, మత ఘర్షణలు సృష్టించేందుకు ఒక "మతపరమైన బృందం" ప్రయత్నిస్తోందని, అలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం తీవ్రంగా హెచ్చరించారు. ధుబ్రి జిల్లాలో రాత్రి సమయాల్లో కనిపిస్తే కాల్చివేత (షూట్ ఎట్ సైట్) ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని సంచలన ప్రకటన చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు శుక్రవారం ఆయన ధుబ్రిలో పర్యటించారు.

కొన్ని రోజులుగా ధుబ్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూన్ 9న ధుబ్రి పట్టణంలోని ఓ ఆలయం సమీపంలో మాంసం ముక్కలు కనపడటంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు 10న పట్టణంలో నిషేధాజ్ఞలు విధించి, మరుసటి రోజు మంగళవారం, జూన్ 11న వాటిని ఉపసంహరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం ధుబ్రికి చేరుకుని పరిస్థితిని అంచనా వేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ "ఈరోజు నేను గౌహతికి చేరుకున్న వెంటనే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేస్తాం. రాత్రిపూట ఎవరైనా బయట తిరిగినా లేదా రాళ్లు రువ్వినా వారిని అరెస్టు చేస్తారు" అని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్), సీఆర్పీఎఫ్ బలగాలను మోహరిస్తామని, ధుబ్రిలోని నేరస్థులందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు. "చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా పరిగణిస్తాం" అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వారం రోజులుగా ధుబ్రిలో శాంతిభద్రతల పరిస్థితి సవాలుగా మారిందని ఆయన అంగీకరించారు.

జూన్ 7న జరిగిన బక్రీద్ పండుగ మరుసటి రోజు అంటే జూన్ 8న జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయం ముందు గుర్తుతెలియని వ్యక్తులు ఒక ఆవు తలను ఉంచారని, ఈ ఘటనపై హిందూ, ముస్లిం వర్గాల వారు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అయితే, ఆ మరుసటి రోజు మళ్లీ అదే ఆలయం ముందు ఆవు తలను ఉంచడమే కాకుండా, రాత్రి సమయంలో రాళ్లు కూడా రువ్వారని ఆయన వివరించారు.

"ఒక మతపరమైన బృందం ధుబ్రిలో అశాంతిని సృష్టించడానికి చురుకుగా పనిచేస్తోందని నాకు సమాచారం అందింది. అందుకే నేను ధుబ్రికి వచ్చాను. జిల్లాలో రాత్రిపూట కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమల్లో ఉంటాయి" అని శర్మ పునరుద్ఘాటించారు. అంతేకాకుండా, బక్రీద్‌కు ఒక రోజు ముందు, జూన్ 6న, 'నబిన్ బంగ్లా' అనే సంస్థ ధుబ్రిని బంగ్లాదేశ్‌లో విలీనం చేయాలనే లక్ష్యంతో రెచ్చగొట్టే పోస్టర్లను ప్రదర్శించిందని ముఖ్యమంత్రి ఆరోపించారు.

గతంలో బక్రీద్ సందర్భంగా కొంతమంది మాత్రమే గోమాంసం తీసుకునేవారని, కానీ ఈసారి పశ్చిమ బెంగాల్ నుంచి వేలాది పశువులను ధుబ్రికి తరలించారని, పండుగకు కొన్ని రోజుల ముందు వేలాది జంతువులను సేకరించిన ‘కొత్త బీఫ్ మాఫియా’ ఒకటి ధుబ్రిలో పుట్టుకొచ్చిందని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. "ఈ విషయం నా దృష్టికి వచ్చింది, దీనిపై విచారణకు ఆదేశించాను. ఈ పశువుల అక్రమ వ్యాపారం ప్రారంభించిన వారిని అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించాను" అని ఆయన తెలిపారు.

వచ్చే ఏడాది ఈద్ రోజున తానే స్వయంగా ధుబ్రికి వస్తానని, మరుసటి రోజు కూడా అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. "ఒక వర్గం వారు ఇలాంటి అలజడులు సృష్టించడాన్ని మా ప్రభుత్వం అనుమతించదు. దీన్ని మేం సహించం. ధుబ్రి జిల్లా మా చేతుల్లోంచి జారిపోవడానికి మేం ఒప్పుకోం" అని పేర్కొన్నారు. అవసరమైతే హనుమాన్ మందిరానికి రాత్రంతా తానే స్వయంగా కాపలా కాస్తానని అన్నారు. జిల్లాలో శాంతిభద్రతలను పటిష్టంగా అమలు చేయడానికి, అన్ని మతతత్వ శక్తులను ఓడించడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు.

Tags:    

Similar News