బెంగళూరులోని రామేశ్వరం కెఫేలోమార్చి 1న జరిగిన బాంబు పేలుడు ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ ని దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితుడికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారి NIA 10లక్షల రివార్డును ప్రకటించింది. తాజాగా టోపీ, మాస్క్ లేకుండా ఉన్న అనుమానితుడి చిత్రాలు బహిర్గతమయ్యాయి. నిందితుడు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో సీసీ టీవీ ఫుటేజ్లో అతని దృశ్యాలు రికార్డయ్యాయి.
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ NIA దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే నిందితుడి సమాచారం ఇచ్చిన వారికి 10 లక్షల రూపాయల రివార్డు ప్రకటించిన NIA దర్యాప్తులో మరో కీలక ముందడుగువేసింది. ఇప్పటివరకూ NIA విడుదల చేసిన అనుమానితుడి ఫోటోలు, దృశ్యాలు అన్నీ మాస్క్ పెట్టుకునే... ఉన్నాయి. తాజాగా మాస్క్, టోపీ లేకుండా ఉన్న నిందితుడి ఫొటోలు బహిర్గతం అయ్యాయి. అనుమానితుడు బస్సులో ప్రయాణిస్తుండగా అందులోని సీసీ టీవీ ఫుటేజ్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఫోటోల్లో నిందితుడి ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని ఫొటోల్లో మాస్క్ పెట్టుకుని ఉన్న నిందితుడు మరికొన్ని ఫోటోల్లో మాత్రం ఎలాంటి మాస్క్ లేకుండా కనిపించాడు.
బుధవారమే రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో NIA కీలక ప్రకటన చేసింది. నిందితుడి ఫొటోను విడుదల చేసిన అధికారులు.. అతడి ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల నగదు రివార్డును ప్రకటించారు. సమాచారం చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నిందితుడు ఏ మార్గంలో కెఫేలోకి వచ్చాడు.. బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు.. అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడు RDX ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కెఫేలో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తన చేతిలోని పేలుడు పదార్థాలున్న సంచిని అక్కడపెట్టి హడావుడిగా వెళ్లిన నిందితుడి సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ఇందుకోసం ఐదు కిలోమీటర్ల పరిధిలోని 300 సీసీ కెమెరాల చిత్రాలను విశ్లేషించారు. తెల్లటోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్కు కట్టుకుని నల్లబూట్లు, అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. టైమర్ బాంబు సంచిని కెఫేలో పెట్టిన వేళ చేతికి గ్లవ్స్ ధరించి ఉన్నట్లుగా గుర్తించారు.