BHARAT: ప్రపంచ రికార్డు బద్దలుకొట్టిన భారత్

పాక్‌పై ఆపరేషన్‌ సిందూర్‌.. వాయుసేన ఘన విజయం... 300 కి.మీ. దూరం నుంచి లక్ష్యం ఛేదించిన భారత్‌... ప్రపంచ రికార్డు బద్దలు;

Update: 2025-08-11 06:00 GMT

భారత్‌ క్రికెట్‌ మైదానంలోనే కాదు, యుద్ధ రంగంలో కూడా రికార్డులు తిరగరాసింది. పాకిస్థాన్‌పై వాయుసేన చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ప్రపంచ సైనిక చరిత్రలో ఒక కొత్త అధ్యాయం రాసింది. వాయుసేన చీఫ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఆపరేషన్‌లో భారత బలగాలు పాక్‌ గగనతలంలోని ఐదు ఫైటర్‌ జెట్లు మరియు ఒక భారీ విమానాన్ని విజయవంతంగా కూల్చేశాయి. ముఖ్యంగా, ఒక విమానాన్ని ఏకంగా 300 కిలోమీటర్ల దూరం నుంచే ధ్వంసం చేయడం ప్రపంచ రికార్డు. ఇప్పటివరకు గగనతల లక్ష్యాన్ని అత్యధికంగా 200 కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే ఛేదించగలిగారు.

ప్రపంచ రికార్డు బద్దలు

2024 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థ రష్యాకు చెందిన ఏ-50 నిఘా విమానాన్ని 200 కిలోమీటర్ల దూరంలో కూల్చడం అప్పటి రికార్డు. 2022లో రష్యా ఎస్‌-400 వ్యవస్థతో ఉక్రెయిన్‌ సు-27 యుద్ధ విమానాన్ని 150 కిలోమీటర్ల దూరంలో పేల్చింది. అయితే ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో సాధించిన 300 కిలోమీటర్ల దూరపు లక్ష్యం ఈ రికార్డులను అధిగమించింది.

ఎందుకు అంత ప్రాధాన్యం?

సుదూర గగనతల లక్ష్యాలను ఛేదించడం అత్యంత క్లిష్టం. వీటికి బియాండ్‌ విజువల్‌ రేంజ్‌ (BVR) సామర్థ్యమున్న అత్యాధునిక క్షిపణులు అవసరం. భారత్‌ రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ ఈ సామర్థ్యం కలిగి ఉంది. ఇందులోని 40ఎన్‌6 క్షిపణులు 400 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాన్ని ఛేదించగలవు. ఆపరేషన్‌లో వీటిని పూర్తిగా వినియోగించినట్లు సమాచారం. ఈ విజయంతో పాక్‌ యుద్ధ విమానాలు భారత గగనతలానికి దగ్గరపడే సాహసమే చేయలేకపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఎస్‌-400 వ్యవస్థ – ప్రత్యేకతలు

ఎస్‌-400ను రష్యా ఎన్‌పీవో అల్మాజ్‌ సంస్థ అభివృద్ధి చేసింది. ఇది యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్‌ క్షిపణులు, బాలిస్టిక్‌ క్షిపణులను అత్యంత కచ్చితత్వంతో నేలకూల్చగలదు. ప్రత్యర్థి జామింగ్‌ టెక్నాలజీని కూడా తట్టుకోగలదు. 2018లో భారత్‌ రష్యాతో 543 కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకొని ఐదు వ్యవస్థలను కొనుగోలు చేసింది. వాటిలో మూడు ఇప్పటికే భారత్‌ చేరాయి. మిగిలినవి వచ్చే ఏడాది ఆగస్టులో అందే అవకాశం ఉంది.

వ్యూహాత్మక మోహరింపు

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పంజాబ్‌, రాజస్థాన్‌లలో ఒక్కొక్క ఎస్‌-400 వ్యవస్థను మోహరించినట్లు తెలుస్తోంది. అలాగే చైనా ముప్పు దృష్ట్యా అరుణాచల్‌ ప్రదేశ్‌ లేదా అస్సాంలో మరో వ్యవస్థను రంగంలోకి దించి ఉండవచ్చని రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో భారత్‌ కేవలం పాక్‌పై మాత్రమే కాకుండా, ప్రపంచ సైనిక వేదికపై తన సాంకేతిక, వ్యూహాత్మక సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసుకుంది. ఇక ఆపరేషన్‌ సిందూర్‌ విజయంతో భారత్‌ గగనతల రక్షణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. సైనిక నిపుణుల ప్రకారం, ఈ ఆపరేషన్‌ ద్వారా పాకిస్థాన్‌ వైమానిక దళంపై మన సాంకేతిక ఆధిక్యం స్పష్టమైందని అంటున్నారు. 300 కి.మీ. దూరంలో నుంచే శత్రు లక్ష్యాలను కూల్చడం వలన, భవిష్యత్తులో పాక్‌ యుద్ధవిమానాలు సరిహద్దు దాటి ముందుకు సాహసించలేవని అంచనా.

Tags:    

Similar News