Bihar Elections: రెండు-మూడు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయం..;
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఏడాది చివర్లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22, 2025తో ముగుస్తుంది. దీనికి ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించింది. దీపావళి, ఛత్ పండగల్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
రెండు నుంచి మూడు దశల్లో బీహార్ ఎన్నికలు నిర్వహించనున్నట్లుత తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో కూడా ఇలాగే బహుళ దశల్లో ఎన్ని్కలు జరిగాయి. 2020లో ఓటింగ్ మూడు దశల్లో జరిగింది. 2015లో ఐదు దశల్లో ఎన్నికలు జరిగాయి. ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ నెల చివర్లో బీహార్ను సందర్శించి సన్నాహాలను సమీక్షిస్తారని భావిస్తున్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి బూత్ లెవర్ ఆఫీసర్లు(BLOలు) సహా పోల్ అధికారులకు శిక్షణ అందిస్తున్నారు. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికల సమయంలో ఓటర్ జాబితాపై వచ్చిన ఆరోపణలు, ఈ ఎన్నికల్లో రిపీట్ కాకుండా ఈసీ చర్యలు తీసుకుంటోంది.
2020 బీహార్ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో ఓటింగ్ జరిగింది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని కూటమి భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, రెండేళ్లకే ఆ ప్రభుత్వం కూలిపోయింది. అన్ని విషయాలలో బీజేపీదే పై చేయి కావడంతో ఆ కూటమిని వదిలేసి 2022లో ఆర్జేడీ పంచన చేరి నితీశ్ తన పదవిని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత గతేడాది జనవరిలో నితీశ్ కుమార్ మళ్లీ బీజేపీ గూటికి చేరారు.