Bihar: బీజేపీ నేత ఖేమ్కా హత్య కేసు నిందితుడు ఎన్‌కౌంటర్

హత్య వెనుక రాజకీయ నేత ప్రమేయం ఉన్నట్లుగా అనుమానం;

Update: 2025-07-08 04:30 GMT

బీహార్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన వికాస్ అలియాస్ రాజా హతమయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాజా చనిపోయాడు. సంఘటనాస్థలి నుంచి తుపాకీ, బుల్లెట్, కార్ట్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని పాట్నాలోని నలంద మెడికల్ కాలేజీకి తరలించినట్లు బీహార్ పోలీసులు అధికారిక ప్రకటనలో తెలిపారు.

ఖేమ్కా హత్యకు సంబంధించి పాట్నా పోలీసులు డజనుకు పైగా అనుమానితులను అరెస్ట్ చేశారు. ఇక ఖేమ్కా అంత్యక్రియలకు పాట్నాలోని పున్‌పున్ నివాసి రోషన్ కుమార్ హాజరయ్యాడు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య మిస్టరీ వీడించింది. అయితే ఈ హత్యలో రాజా ప్రధాన సూత్రధారిగా అనుమానించారు. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు రాజాను ఎన్‌కౌంటర్ చేశారు.

ఇక ప్రధాన నిందితుడు ఉమేష్‌ను సోమవారం పాట్నాలో అరెస్టు చేసినట్లు వర్గాలు తెలిపాయి. అయితే ఈ హత్య వెనుక ఒక రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ దిశగా కూడా పోలీసులు విచారిస్తున్నారు.

జూలై 4న రాత్రి 11:40 గంటల సమయంలో ఖేమ్కా ఇంటికి చేరుకోగానే సమీపంలో నక్కిన దుండగులు తుపాకీ తీసుకుని కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడికక్కడే ఖేమ్కా చనిపోయారు. మూడేళ్ల క్రితం కుమారుడు కూడా హత్యకు గురయ్యాడు. అయితే రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ముందు హత్య జరగడంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నితీశ్‌కుమార్‌ పాలనలో బీహార్‌ నేర రాజధానిగా మారిందని రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యాపారవేత్తలకు, ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని.. హత్యలు, దోపిడీలు సర్వసాధారణంగా మారాయని ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ ధ్వజమెత్తారు.

Tags:    

Similar News