BJP : బీజేపీ జాతీయ అధ్యక్ష పీఠంపై మహిళ ?
రేసులో నిర్మలా సీతారామన్, పురందేశ్వరి!;
కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవడంతోపాటు దేశంలో సగానికిపైగా రాష్ట్రాల్లో అధికారం చేలాయిస్తున్న బీజేపీ (BJP).. పార్టీని మరింతగా విస్తరించేందుకు సిద్ధమవుతున్నది. మరోసారి ఢీల్లీ పీఠాన్ని దక్కించుకోవడం, విపక్షాల ఏలుబడిలో ఉన్న ఆ ఐదారు రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకోవడానికి కాషాయ దళం ప్రణాళికలు రచిస్తున్నది. గత ఎన్నికల్లో పార్టీ విజయాల్లో కీలకపాత్ర పోషించిన మహిళలను చేజార్చుకోకూడదని కమలం పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్ష పీఠంపై మహిళను కూర్చోబెట్టాలని తీవ్రంగా ఆలోచిస్తున్నది. దీనికి ఆర్ఎస్ఎస్ కూడా పచ్చజెండా ఊపినట్లు సమాచారం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్లను పార్టీ అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నది. ఈ ముగ్గురిలో ఎవరినో ఒకరిని అధ్యక్ష పదవి వరించనుంది. ఒకవేళ అదే జరిగితే కషాయ దళానికి తొలిసారిగా ఓ మహిళ సారథి కానున్నది. అయితే ఈ రేసులో ప్రధాని మోదీ కేబినెట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తున్నది.
నిర్మలా సీతారామన్..
పార్టీ అధ్యక్ష రేసులో నిర్మలా సీతారామన్పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఇటీవలే జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోశ్లు నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సీతారామన్ పేరునే చర్చించినట్లు తెలుస్తున్నది. కేంద్ర ఆర్థిక మంత్రిగా, రక్షణమంత్రిగా తానేంటో నిరూపించుకున్న ఆమెకు పార్టీలో సుదీర్ఘమైన అనుభవం ఉంది. అలాగే నాయకత్వ సామర్థ్యం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఆమె నియామకంతో దక్షిణాదిలో పాగా వేయాలన్న లక్ష్యం కూడా నెరవేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కలిసొచ్చే అవకాశం ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని భావిస్తున్న మోదీ సర్కార్.. త్వరలోనే ఈ బిల్లును కూడా ఆమోదించాలని ఆలోచిస్తున్నది. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ అయితేనే సరైనవారని పార్టీ అగ్రనాయకత్వం ఆలోచనగా ఉన్నది. ఆమెకు ఆర్ఎస్ఎస్ కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తున్నది.
వనతి శ్రీనివాసన్
తమిళనాడుకు చెందిన వానతి శ్రీనివాసన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నది. న్యాయవాది వృత్తి నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన ఆమె ప్రస్తుతం కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1993లో బీజేపీలో చేరిన ఆమె అంచలంచలుగా ఎదుగుతూ.. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2020లో ప్రమోషన్ పొందిన ఆమె.. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అనంతరం 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా నియమితురాలై.. తమిళనాడు నుంచి ఈ పదవి పొందిన మొదటి మహిళగా నిలిచారు.
పురందేశ్వరి
బహుభాషా కోవిధురాలైన రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ పురందేశ్వరి కూడా పార్టీ జాతీయ అధ్యక్ష రేసులో నిలిచారు. కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న ఆమె నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పుంజుకున్నది. ఆపరేషన్ సిందూర్పై వివిధ దేశాల్లో పర్యటించిన ప్రజాప్రతినిధుల బృందంలో పురందేశ్వరి కూడా ఉన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టాలంటే ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఉండాల్సిందే. అధ్యక్ష ఎంపికలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాత్ర ప్రధానమైనది. ఇటీవల పలు రాష్ట్రాల్లో నియమితులైన పార్టీ అధ్యక్షుల్లో ఆర్ఎస్ఎస్ ముద్ర స్పష్టంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న వారికే పదవుల్లో ప్రియార్టీ ఇస్తున్నది. ఈ నేపథ్యంలో పురందేశ్వరికి ఈ విషయం ప్రతిబంధకంగా మారే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె.. కొన్నేండ్ల క్రితమే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
కాగా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పదవీకాలం రెండేండ్ల క్రితమే (2023, జనవరి) ముగిసింది. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పదవీకాలాన్ని 2024 జూన్ వరకు పొడిగించారు. నూతన అధ్యక్షుడిని ఎంపికచేయకపోవడంతో ఆయన ఇంకా ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో అధ్యక్షుడి మార్పు తప్పనిసరి అయింది. దీంతో పార్టీ అగ్రనాయకత్వం అధ్యక్ష మార్పుపై తీవ్ర కసరత్తు చేస్తున్నది.