Maneka Gandhi: ఇస్కాన్పై బీజేపీ ఎంపీ తీవ్ర ఆరోపణలు..
గోవులను కబేళాకు అమ్ముకుంటున్నారన్న మేనకా గాంధీ;
ఇస్కాన్ పై భారతీయ జనతా పార్టీ ఎంపీ మేనకా గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు . తమ గోశాలల్లో ఉన్న గోవుల్ని ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్సియస్నెస్ అమ్ముకుంతోందని ఆరోపించారు. ఇది దేశంలో జరుగుతున్న అతిపెద్ద మోసమని ఆమె అన్నారు. ఆవుల షెడ్లను నడుపుతూ ప్రభుత్వం నుండి భారీగా భూములతో పాటు అనేక ప్రయోజనాలను పొందుతున్నారన్న ఆమె.. ఇస్కాన్లో పెద్ద ఎత్తున మోసం జరుగుతోందని విమర్శించారు. ఇక్కడ గోవులను గోశాల నుంచి బయటకు తీసి కసాయిలకు విక్రయిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు మేనకా గాంధీ. అయితే, బీజేపీ ఎంపీ వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించింది ఇస్కాన్.
కేంద్ర మాజీ మంత్రి అయిన మేనకా గాంధీ.. జంతు హక్కుల పరిరక్షణలో నిరంతరం చురుకుగా ఉన్నారు. ఇస్కాన్ దేశంలోనే అతిపెద్ద మోసం అని ఆమె ఆరోపించారు. తాను ఇస్కాన్కు చెందిన అనంతపురం గోశాలకు వెళ్లానని, అక్కడ పాలు ఇవ్వని ఒక్క ఆవు కూడా కనిపించలేదు.. అలాగే డెయిరీ మొత్తంలో ఒక్క దూడ లేదు. పాడిపరిశ్రమలో పాలు ఇవ్వని ఒక్క ఆవులు లేవు.. ఒక్క దూడ కూడా లేదంటే అవి అన్నీ అమ్మేసినట్టే కదా? అన్నారు. ఇస్కాన్ తన ఆవులన్నింటినీ కసాయిలకు విక్రయిస్తోందని ఆరోపించారు మేనకా గాంధీ. మేనకా గాంధీకి సంబంధించిన ఈ ఇంటర్వ్యూ దాదాపు నెల రోజుల క్రితం అయినట్టు సమాచారం. ‘మదర్స్ మిల్క్’ పేరుతో డాక్యుమెంటరీ తీసిన డాక్టర్ హర్ష ఆత్మకూరి.. బీజేపీ ఎంపీ మేనకా గాంధీతో మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇక, ఆవులను కసాయిదారులకు విక్రయిస్తున్నట్లు మేనకా గాంధీ చేసిన ఆరోపణలపై ఇస్కాన్ స్పందించింది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో గోసంరక్షణలో ఇస్కాన్ అగ్రగామిగా ఉందని ప్రకటించింది ఇస్కాన్. ఆ ఆరోపణలు నిరాధారమైనవని, తప్పుడువని పేర్కొన్నది. గోవులు, ఆవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుదిష్టర్ గోవింద దాస్ తెలిపారు. కేవలం ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా తాము గోవుల్ని ఆదరించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. గోవులకు జీవితాలను ప్రసాదిస్తున్నామని, వాటిని కసాయిలకు అమ్మడం లేదని ఇస్కాన్ చెప్పింది. ఇస్కాన్ ప్రతినిధి తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో ఈ విషయాన్ని తెలిపారు.