Ahmedabad plane crash: గుట్టు విప్పనున్న బ్లాక్బాక్స్
బీజే వైద్యకళాశాల భవనం పైకప్పుపై లభ్యం;
: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. స్థానిక బీజే వైద్యకళాశాల భవనం పైకప్పుపై ఇది దొరికింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్టుకు సిబ్బంది సహా 242 మందితో బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నేలకూలిన సంగతి తెలిసిందే. కాగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ చేరుకుని విమాన ప్రమాద ఘటనా స్థలిలో పర్యటించారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ కుటుంబసభ్యులను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. జాతీయ దర్యాప్తు బృందం సైతం ప్రమాదస్థలంలో పరిశీలన జరిపింది.
మరోవైపు విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించే ప్రక్రియ మొదలైంది. ముఖాలను గుర్తించిన ఆరుగురి మృతదేహాలను వారి బంధువులకు శుక్రవారం అధికారులు అప్పగించారు. ప్రయాణికుల బంధువులకు సహకరించేందుకు ఎయిరిండియా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రమాద స్థలంలోని బీజే వైద్యకళాశాల రెసిడెన్షియల్ క్వార్టర్ల భవనం పైకప్పు నుంచి బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) వెల్లడించింది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అందులోని సమాచారమే కీలకం. ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది పౌరవిమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఏఏఐబీ వెల్లడించింది. మరోవైపు అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) పరిశీలించింది. ఈ బృందం వెంట ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు.
విమానం కూలిన ప్రదేశానికి శుక్రవారం వెళ్లిన ప్రధాని ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భాజపా నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్రూపాణీ కుటుంబసభ్యులను ప్రధాని పరామర్శించారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లిన మోదీ విమాన ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ప్రధాని వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తదితరులు ఉన్నారు.