Operation Sindoor: ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కరాచీ పోర్టు దిగ్బంధం
యుద్ధ నౌకలు, జలాంతర్గాములను భారీగా మోహరించినట్లు తెలిపిన నౌకదళాలు;
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందుకు ప్రతిగా పాక్ ప్రతిస్పందించే అవకాశాన్ని పసిగట్టిన నౌకాదళం సముద్ర సంసిద్ధతను గణనీయంగా పెంచడానికి అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా పాక్లోని కరాచీ పోర్టే లక్ష్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను భారీగా మోహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వాటిని మోహరించడంతో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందన్నారు.
అయితే, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ పై త్రిముఖ ఒత్తిడి వ్యూహాన్ని ప్రయోగించామని నావికాదళ అధికారులు వెల్లడించారు. కరాచీ పోర్ట్ను లక్ష్యంగా చేసుకొని 36 ఫ్రంట్లైన్ నావికా దళాలను రంగంలోకి దిగించినట్లు తెలిపారు. వీటిలో బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన ఏడు డిస్ట్రాయర్లు, మీడియం-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణులు, వరుణాస్త్ర హెవీవెయిట్ టార్పెడోలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే, వీటిలో కొత్తగా ప్రవేశపెట్టిన ఐఎన్ఎస్ తుషిల్తో సహా ఏడు స్టెల్త్ గైడెడ్-క్షిపణి యుద్ధ నౌకలను సైతం బరిలోకి దించినట్లు పేర్కొన్నారు. మరోవైపు, ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కరాచీ పోర్టును అష్టదిగ్బంధించడం చేయడంతోనే వారి నావికాదళం సమర్థవంతంగా ప్రతిస్పందించలేక పోయిందన్నారు. కేవలం నౌకాశ్రయానికే పరిమితమవ్వాల్సి వచ్చిందని ఇండియన్ నేవీ చెప్పుకొచ్చింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలు తమ దారిని మళ్లించుకున్నాయని తెలిపారు.