Chennai: బ్రిటిష్ ఎయిర్వేస్లో సాంకేతిక లోపం
గాల్లో చక్కర్లు కొట్టి చెన్నై నుంచి లండన్ వెళ్లిపోయిన ఫ్లైట్;
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత విమాన సంస్థలు అప్రమత్తంగా ఉంటున్నాయి. ఏ చిన్న లోపం ఉన్నా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. లండన్ నుంచి చెన్నైకు వచ్చింది. అయితే విమానం ల్యాండింగ్కు సహకరించకపోవడంతో పైలట్ అప్రమత్తమై చెన్నైలో చక్కర్లు కొట్టిన తర్వాత తిరిగి లండన్కు మళ్లించేశాడు. సురక్షితంగా విమానం ల్యాండింగ్ అయింది. అనంతరం ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా కిందకు దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
లండన్ నుంచి చెన్నైకు వెళ్లిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని.. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా విమానం తిరిగి హీత్రూకు వచ్చేసినట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ తెలిపింది. కారణాలు మాత్రం వివరంగా వెల్లడించలేదు.
విమాన సంస్థ వెబ్సైట్ ప్రకారం.. బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం BA35 ఆదివారం మధ్యాహ్నం 12:40 గంటలకు బయల్దేరాల్సి ఉంది. అయితే 35 నిమిషాల ఆలస్యంగా మధ్యాహం 1:16 నిమిషాలకు బయల్దేరింది. తెల్లవారుజామున 3:30 గంటలకు చెన్నై చేరుకోవల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. చెన్నైలో చక్కర్లు కొట్టిన తర్వాత తిరిగి పైలట్ లండన్కు తీసుకెళ్లి సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. దాదాపు 2 గంటలు గాల్లోనే ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న లుఫ్తాన్స్ విమానంలో కూడా సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి ఆదివారం ఫ్రాంక్ఫర్ట్కు తిరిగి వెళ్లిపోయింది. దీనికి కారణాలు ఇంకా వెల్లడించలేదు. బాంబు బెదిరింపు కారణంగానే వెళ్లిపోయినట్లు సమాచారం. బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానం ఫ్రాంక్ఫర్ట్ నుంచి మధ్యాహ్నం 13.05 గంటలకు బయలుదేరే సమయానికి బదులుగా 14.29 గంటలకు బయలుదేరింది. వెబ్సైట్ ప్రకారం విమానం తెల్లవారుజామున 1.20 గంటలకు హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది.
జూన్ 12న ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. మెడికోలో ఉంటున్న హాస్టల్పై విమానం కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. సుదూర ప్రయాణం కావడంతో భారీగా ఇంధనం ఉంది. అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కరు మినహా మిగతా వారంతా చనిపోయారు. స్వల్ప గాయాలతో ఒక్క ప్రయాణికుడు బయటపడ్డాడు. ఇక మెడికోలు కూడా ఇప్పటి వరకు 35 మంది చనిపోయారు. ఇక చికిత్స పొందుతున్న వారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.