Gujarat: బుల్లెట్ ట్రైన్ బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
తాత్కాలిక నిర్మాణం కూలి ముగ్గురు కార్మికుల మృతి;
బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా గుజరాత్లో నిర్మిస్తున్న ఒక బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణం కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గంలో గుజరాత్లోని ఆనంద్ జిల్లా వాసద్ గ్రామంలో మహీ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద గడ్డర్లతో ఏర్పాటు చేసిన తాత్కాలిక కట్టడం మంగళవారం సాయంత్రం కూలిపోయింది. దీంతో నలుగురు కార్మికులు కాంక్రీట్ దిమ్మెలు, శిథిలాల మధ్య ఇరుక్కుపోయారు. దీంతో క్రేన్లు, ఎస్కవేటర్ల సాయంతో సహాయ చర్యలు చేపట్టారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. 508 కి.మీ పొడవు ఉండే ఈ మార్గం గుజరాత్ (352 కి.మీ), మహారాష్ట్ర (156 కి.మీ) మీదుగా సాగుతుంది. బ్రిడ్జి పునాది పటిష్ఠంగా ఉండటం కోసం స్టీల్, కాంక్రీట్ దిమ్మెలతో తాత్కాలిక నిర్మాణం చేపట్టారు.
ఆనంద్ జిల్లాలోని వల్సాద్ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ పనులు జరుగుతున్నాయి. కాంక్రీట్ దిమ్మెల ఒక్కసారిగా కిందపడ్డాయి. వాటిపై కూర్చున్న నలుగురు వాటిల్లో చిక్కుకున్నారు. శిథిలాల కింద నుంచి వెలికితీసిన ఇద్దర్ని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. స్టీల్, కాంక్రీటుతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నిర్మాణం కూలిపోయిందని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. వడోదరా సమీపంలో ఉన్న మహీ నదికి దగ్గరలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని, సహాయక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.