Gallantry Awards: ఆపరేషన్ సిందూర్లో సత్తా చాటిన సైనికులకు పురస్కారాలు..
భారత సైనిక సిబ్బందికి శౌర్య పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
దేశ రక్షణలో అసాధారణ ధైర్యసాహసాలు, విశిష్ఠ సేవలు అందించిన భారత సైనిక దళాల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది. ఇటీవల విజయవంతంగా ముగిసిన ‘ఆపరేషన్ సిందూర్’ సహా పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్న ఆర్మీ, వైమానిక దళాలకు చెందిన పలువురు అధికారులను ప్రతిష్ఠాత్మక ‘వీర చక్ర’ పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు కేంద్రం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివిధ ఆపరేషన్లలో భాగంగా ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన 1988 (ఇండిపెండెంట్) మీడియం బ్యాటరీకి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ బిస్త్కు వీర చక్ర లభించింది. అలాగే, అత్యంత రహస్యంగా, తక్కువ సమయంలోనే ప్రత్యేక పరికరాలను విమానాల ద్వారా సమర్థంగా తరలించి, సైనిక సామర్థ్యాన్ని చాటిన 302 మీడియం రెజిమెంట్కు చెందిన కల్నల్ కోశాంక్ లాంబాను కూడా ఈ పురస్కారం వరించింది.
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నుంచి పలువురు అధికారులు వీర చక్రకు ఎంపికయ్యారు. శత్రువుల కట్టుదిట్టమైన గగనతలంలోకి చొచ్చుకెళ్లి, నిర్దేశిత లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించినందుకు ఫైటర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ రంజీత్ సింగ్ సిద్ధూకు ఈ గౌరవం దక్కింది. ఫార్వర్డ్ ఎయిర్బేస్లో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (ఎస్ఏఎం) స్క్వాడ్రన్కు నాయకత్వం వహించి, మన వనరులకు ఎలాంటి నష్టం జరగకుండా శత్రువులకు భారీ నష్టం కలిగించిన గ్రూప్ కెప్టెన్ అనిమేశ్ పట్నీ కూడా వీర చక్ర అందుకున్నారు.
అత్యంత ప్రమాదకరమైన మిషన్లో భాగంగా, అర్ధరాత్రి వేళ శత్రు భూభాగంలోకి ప్రవేశించి కోటలాంటి లక్ష్యాలను ధ్వంసం చేసిన స్క్వాడ్రన్ లీడర్ రిజ్వాన్ మాలిక్, సంక్లిష్టమైన వైమానిక దాడిలో అద్భుతమైన సమన్వయం ప్రదర్శించిన స్క్వాడ్రన్ లీడర్ సిద్ధాంత్ సింగ్లకు కూడా వీర చక్ర పురస్కారాలు ప్రకటించారు.
మొత్తంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 127 గ్యాలంట్రీ అవార్డులు, 40 విశిష్ట సేవా పురస్కారాలకు ఆమోదం తెలిపారు. వీటిలో 4 కీర్తి చక్రలు, 15 వీర చక్రలు, 16 శౌర్య చక్రలు ఉన్నాయి. దేశ భద్రత పట్ల సైనిక దళాల అంకితభావం, నాయకత్వ పటిమ, కార్యాచరణ నైపుణ్యాలకు ఈ పురస్కారాలు నిదర్శనమని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.